Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి..
నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి కలకలం రేపింది. ఎర్రగూడూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి రహదారి దాటేందుకు యత్నించగా, వాహనదారులు సమయస్ఫూర్తితో హారన్లు మోగిస్తూ కేకలు వేయడంతో అది తిరిగి అడవిలోకి పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఎర్రగూడూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఒక ఎలుగుబంటి, సమీపంలో ఉన్న నేషనల్ హైవేని దాటేందుకు యత్నించింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఎలుగుబంటిని చూసి ఒక్కసారిగా హారన్లు మోగిస్తూ బిగ్గరగా కేకలు వేశారు. దాంతో భయపడిన ఆ మృగం వెంటనే తిరిగి అడవిలోకి పరుగులు తీసింది. వాహనదారులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనతో ఎర్రగూడూరుతో పాటు సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు, వ్యవసాయ కూలీలు వణికిపోతున్నారు.
గతంలో దాడులు..
ఈ ప్రాంతంలో ఎలుగుబంట్ల భయం కొత్తేమీ కాదని స్థానికులు చెబుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతానికి చెందిన జనకుడు అనే గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలంలో పనిచేసుకుంటుండగా, అకస్మాత్తుగా ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ పాత ఘటనను గుర్తుచేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో మాత్రమే కాదు, పగటిపూట కూడా బయటకు రావడానికి భయపడుతున్నారు.
అటవీ శాఖ హెచ్చరికలు – గ్రామస్తుల డిమాండ్
ఎలుగుబంటి సంచారం నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. అయితే కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా ఈ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉన్నందున వాటిని తక్షణమే బోనులో బంధించి, సుదూర అటవీ ప్రాంతంలో వదలిపెట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
