Heatwave Alert: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీ వివపత్తు నిర్వహణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాలో తీవ్ర గరిష్ట ఉష్ణోగ్రలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

సోమవారం 51 మండలాల్లో తీవ్రవడగాలులు, 49 మండలాల్లో వడగాలులు, మంగళవారం 53 మండలాల్లో తీవ్రవడగాలులు, 57 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం శ్రీకాకుళం జిల్లాలో 9 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 18 మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లాలో 15, అల్లూరి జిల్లాలో 1, పోలవరంలో 3, అనకాపల్లిలో 3, ఏలూరులో 2 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 5, అల్లూరి జిల్లాలో 4 , పోలవరం 9, అనకాపల్లి 5, కాకినాడ 5, తూర్పుగోదావరి 9, ఏలూరు 4, ఎన్టీఆర్ 3, పల్నాడు 2, నంద్యాల 1 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.
ఆదివారం కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీలు తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 43.1 డిగ్రీలు, నంద్యాలలో 42.9 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లెలో 42.3 డిగ్రీలు, కర్నూలు జిల్లా గూడూరులో42.1 డిగ్రీలు పల్నాడు జిల్లా దుర్గిలో 41.8 డిగ్రీలు శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో 41.6 డిగ్రీలు, మార్కాపురం జిల్లా అనుమలపల్లి, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 41.2 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లాలో పోడూరులో 41.1డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రాకుండా ఉండటం మంచిదన్నారు. ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ఎండలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపి పెట్టుకోవాలని, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించాలన్నారు.అదే విధంగా కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
