Andhra Pradesh: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇంటి వద్దకే వచ్చేస్తారు.. ఎక్కడికి వెళ్లాల్సిన అక్కర్లేదు..
పించన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. 16 వరకు కొనసాగనుంది. అయితే దరఖాస్తు చేసుకునే దివ్యాంగులు, వికలాంగులకు ప్రభుత్వం రిలీఫ్ ప్రకటించింది. వారికి దరఖాస్తులు నింపడంలో సహాయం చేయాలని సూచించింది.

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఊరట కల్పించింది. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. వీరికి దరఖాస్తులు నింపడంలో వీవోఏలు (యానిమేటర్లు), వీవోవోబీలు సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే దరఖాస్తులను త్వరగా ఆన్లైన్లో నమోదు చేయించే బాధ్యత కూడా ప్రభుత్వం వీవోఏలు, వీవోవోబీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కార్యాలయాలకు వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగుల వద్దకు వెళ్లి వారి వివరాలు సేకరించి నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా సచివాలయాల వద్ద తాగునీరు నిరంతరం అందుబాటులో ఉంచాలని సూచించింది.
వృద్ధులు, దివ్యాంగులు కార్యాలయాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి సెర్ప్ సీఈవో వాకాటి కరుణ పీడీలకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులందరూ ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. పించన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే దివ్యాంగులు, వికలాంగులు ఇబ్బంది పడేలా చేయవద్దని సూచించింది. అయితే సెప్టెంబర్ 7వ తేదీ నుంచి పించన్ల దరఖాస్తు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అప్లై చేసుకున్న తర్వాత అర్హతలను అధికారులు పరిశీలించనున్నారు. కేవైసీ వెరిఫికేషన్, కామన్ ఎలిజిబులిటీ వాలిడేషన్, స్క్రూటినీ, స్టేట్ లెవల్ వ్యాలిడేషన్, ప్రభుత్వ ఆమోదం, బడ్జెట్ ఆమోదం తర్వాత పింఛన్ మంజూరు చేయనున్నారు. తొలుత సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుంది. ఆ తర్వాత 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కామన్ ఎలిజిబులిటీ వాలిడేషన్ ఉంటుంది.
22వ తేదీ నుంచి 24 వరకు మూడు రోజుల పాటు అర్హత పరిశీలన, రికమండేషన్ ఉంటుంది. 25వ తేదీ నుంచి 26 వరకు ఆమోదం తెలిపి బడ్జెట్ కేటాయించనుంది. దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లాలి. అనంతరం అప్లికేషన్ ఫారం నిండి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. అర్హత విషయానికొస్తే.. రూరల్ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10 వేల కంటే తక్కువగా ఉండాలి. ఇక అర్బన్ ప్రాంతాల్లో రూ.12 వేల కంటే తక్కువగా ఉండాలి. ఆధార్ కార్డు ప్రకారం వయస్సు ఉండాలి. కుటుంబం ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదు. కుటుంబసభ్యుల్లో ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్ ఉండకూడదు. నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. అలాగే కుటుంబసభ్యులో ఎవరూ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు.
