AP Municipal Polls: రసకందాయంగా మునిసిపల్ పోరు.. వైజాగ్‌లో ఎక్కువ.. గూడూరులో తక్కువ..లెక్కలతో పార్టీలు బిజీబిజీ

ఏపీ మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికరమైన గణాంకాలను సేకరించింది టీవీ9. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఎన్నికలకు సంబంధించి క్యూరియాసిటీ జెనరేట్ అవుతోంది. ఈ లెక్కల ఆధారంగా చూస్తే పార్టీల వ్యూహాల ఖరారులో పలు కీలకాంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.

AP Municipal Polls: రసకందాయంగా మునిసిపల్ పోరు.. వైజాగ్‌లో ఎక్కువ.. గూడూరులో తక్కువ..లెక్కలతో పార్టీలు బిజీబిజీ
Follow us

|

Updated on: Feb 25, 2021 | 7:11 PM

AP Municipal Elections and Interesting developments:  ఏపీలో పురపాలక పోరు క్రమంగా హీటెక్కుతోంది. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నాయి. అభ్యర్థులు ప్రచార సరంజామా రెడీ చేసుకుంటున్నారు. పోలింగ్‌కు ఇంకో పదమూడు రోజులు (ఫిబ్రవరి 25 నాటికి) మాత్రమే మిగిలి వుండడంతో సకల హంగులతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు పార్టీలు, అభ్యర్థులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ మునిసిపల్ ఎన్నికల ముఖచిత్రాన్ని గమనిస్తే ఆసక్తికరమైన గణాంకాలు తెరమీదికి వస్తున్నాయి. ఏపీలో సుమారు 4 కోట్ల జనాభా వుండగా.. పట్టణ, నగర ప్రాంతాలకు చెందిన సుమారు 90 లక్షల మంది ఓటర్లు మునిసిపల్ తీర్పునివ్వబోతున్నారు.

మార్చి 10న ఏపీలో పురపాలక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆరోజు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఏపీలోని 75 మునిసిపాలిటీలు, నగర పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు సహా 12 నగర పాలక సంస్థలు (మునిసిపల్ కార్పొరేషన్లు) కూడా ఎన్నికలకు వెళుతున్నాయి. 12 మునిసిపల్ కార్పోరేషన్లతో పాటు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 90 లక్షల 61 వేల 806 మంది ఓటర్లు తమ తీర్పును ఇవ్వబోతున్నారు. వీరిలో పురుషులు 44 లక్షల 59 వేల 64 మంది కాగా.. మహిళలు 46 లక్షల ఒక వేయి 269 మంది వున్నారు. ఇతరులు 1,473 మందిగా ఓటు హక్కు పొంది వున్నారు.

12 నగర పాలక సంస్థల్లో విజయనగరం, గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ), ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పన్నెండు కార్పోరేషన్‌లలో మొత్తం 52 లక్షల 52 వేల 355 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 25లక్షల 97 వేల 852 మంది కాగా.. మహిళలు 26 లక్షల 53 వేల 762 మంది, ఇతరులు 741 మంది వున్నారు. కాగా.. 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో మొత్తం ఓటర్లు 38 లక్షల 9 వేల 451 మంది వుండగా.. వీరిలో పురుషులు 18 లక్షల 61 వేల 212 మంది, మహిళలు 19 లక్షల 47 వేల 507 మంది, ఇతరులు 732 మంది వున్నారు.

విస్తీర్ణంలోనూ, ఓటర్ల సంఖ్యలోనూ విశాఖ (జీవీఎంసీ) నగర పాలక సంస్ధ మొదటి స్ధానంలో వుంది. విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం డివిజన్లు 98 కాగా.. ఓటర్ల సంఖ్య 17 లక్షల 52 వేల 927 మంది వున్నారు. వీరిలో పురుషులు 8 లక్షల 80 వేల 481, మహిళలు 8 లక్షల 72 వేల 320, ఇతరులు 126 మంది వున్నారు. మచిలీ పట్నం నగర పాలక సంస్థలో అతి తక్కువ మంది ఓటర్లున్నారు. బందరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 50 విడిజన్లు కాగా.. ఓటర్ల సంఖ్య లక్షా 31 వేల 829 మంది మాత్రమే. వీరిలో పురుషులు 63 వేల 883 మంది, మహిళలు 67 వేల 936 మంది, ఇతరులు 10 మంది వున్నారు.

ఇక మునిసిపాలిటీల్లో కర్నూలు జిల్లా నంధ్యాల అతిపెద్ద మునిసిపాలిటీగా వుంది. నంధ్యాల మునిసిపాలిటీ పరిధిలో మొత్తం వార్డుల సంఖ్య 42 కాగా.. మొత్తం ఓటర్ల సంఖ్య లక్షా 86 వేల 310 మంది. వీరిలో 90 వేల 597 మంది పురుషులు, 95 వేల 640 మంది మహిళలు, 73 మంది ఇతరులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వుంది. నగర పంచాయితీల్లో కర్నూలు జిల్లాకే చెందిన గూడూరు చాలా చిన్నది. 20 వార్డులతో వున్న గూడురు నగర పంచాయితీలో మొత్తం ఓటర్ల సంఖ్య కేవలం 15 వేల 789 మంది మాత్రమే.

మునిసిపల్ పోరులో భాగంగా మార్చి పదో తేదీన ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ మొదలవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మార్చి 13వ తేదీన రీపోలింగ్‌కు తేదీని ఖరారు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటలకు మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఆ రోజు సాయంత్రానికి దాదాపు 80 శాతం ఫలితాలు వెల్లడైపోతాయి.

ఇటీవల ముగిసిన నాలుగు విడతల పంచాయితీ పోరులో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన అధికార వైసీపీ.. మునిసిపల్ ఎన్నికల్లోను అదే పంథాను కొనసాగించేందుకు వ్యూహరచన చేస్తోంది. పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినప్పటికీ.. ప్రధాన పార్టీలు తాము మద్దతిచ్చిన అభ్యర్థుల ఆధారంగా పార్టీల విజయాలను లెక్కించుకుంటాయి. ఈ కోణంలో అధికార వైసీపీ దాదాపు 85 శాతం పంచాయితీలను దక్కించుకుంది. ఇపుడు జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలు, త్వరలో జరగబోయే పరిషత్ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన జరుగుతాయి. వీటిలో ప్రధాన రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతాయి. ప్రస్తుతం ఇదే కసరత్తులో ప్రధాన రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి.

ఓటర్ల సంఖ్యతోపాటు సామాజికాంశాలు కీలకం

మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో మొత్తం 90 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓటర్ల సంఖ్యలో వేరియేషన్లు వున్నా.. అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సామాజికాంశాలే కీలకం కానున్నాయి. ముఖ్యంగా బస్తీల్లో పెద్ద ఎత్తున నివసించే వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు చేరుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వుండే మిడిల్ క్లాస్ ఓటర్లు తమవైపే వున్నారని పాలక పక్షం వైసీపీ ధీమాగా వుంది. అయితే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం అధికార పార్టీ వారికే దక్కుతున్నాయంటున్న విపక్షాలు టీడీపీ-సీపీఐ, జనసేన-బీజేపీలు చెబుతున్నాయి. సత్తా చాటగల గెలుపు గుర్రాలను బరిలోకి దింపిన ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి.

ALSO READ: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో చాణక్యం.. వైసీపీ అభ్యర్థుల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే!

ALSO READ: ఆందోళన కలిగిస్తున్న మృగాళ్ళ నేర ప్రవృత్తి.. కలవరపెడుతున్న అకృత్యాల లెక్కలు

ALSO READ: ఎంఐఎం ఎంట్రీతో పొలిటికల్ హీట్.. ప్రభావంపై లెక్కల మీద లెక్కలు.. ఇంతకీ నష్టమెవరికంటే?

ALSO READ: రెండేళ్ళ ముందే కసరత్తు షురూ.. దీదీకి ధీటుగా కమలం వ్యూహం