YS Jagan: ఆశాజనకంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి.. ఆదాయార్జన శాఖలపై సీఎం జగన్ సమీక్ష..
అత్యంత పారదర్శకంగా, ఈజీగా చెల్లింపులు చేసేలా సిస్టమ్ను మార్చాలని సీఎం జగన్ సూచించారు. దేశ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు అధికంగా ఉన్నాయని తెలిపారు.
ఆదాయం పెంచుకునే మార్గాలపై దృష్టిపెట్టాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆదాయం గాడిలో పడిందని.. పన్నుల వసూళ్లలో లీకేజీలను అరికట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అత్యంత పారదర్శకంగా, ఈజీగా చెల్లింపులు చేసేలా సిస్టమ్ను మార్చాలని సూచించారు. దేశ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు అధికంగా ఉన్నాయన్నారు సీఎం జగన్. రాష్ట్రంలో ఆదాయాల ప్రగతి ఆశాజనకంగా ఉందన్నారు. అనుకున్న లక్ష్యాల్లో సుమారు 95శాతం ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు సీఎం జగన్. పారదర్శక విధానాలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 2022 సెప్టెంబర్ వరకు 27వేల 445కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంటే, 25వేల 928కోట్ల ఇన్కమ్ వచ్చినట్లు తెలిపారు. దేశ సగటు జీఎస్టీ వసూళ్లు 27.8 శాతం ఉంటే, ఏపీలో మాత్రం 28.79గా ఉన్నట్లు సీఎం జగన్ లెక్కలను బయటపెట్టారు.
ఆదాయార్జన శాఖలపై గురువారం ఉన్నతస్థాయి సమీక్ష చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మరింత ట్రాన్స్పరెన్సీ, ఈజీ ప్రొసెస్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదాయం కోసం కేవలం పన్నులు పెంచడమే కాకుండా, ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలన్నారు. అందుకోసం వినూత్న ఆలోచనలు చేయాలని సూచించారు సీఎం. రవాణాశాఖలో ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. వాహన కొనుగోళ్లు పెరిగేలా రూల్స్ను సులభతరం చేయాలని సూచించారు.
మైనింగ్ ఆపరేషన్స్ కంటిన్యూగా జరిగేలా చూడటం ద్వారా కూడా ఆదాయం పెంచుకోవచ్చన్నారు. భూములు, ఆస్తులే కాకుండా వేటినైతే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చో, వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు సీఎం జగన్. రిజిస్ట్రేషన్ల వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించగలిగితే ఆదాయం దానంతట అదే పెరుగుతుందన్నారు. అలాగే, గ్రామ-వార్డు సచివాలయాల్లో పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్లు జరిగేలా సిస్టమ్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..