YS Jagan: ‘మీ భూమి మా హామీ’.. జగన్ సర్కార్ సరికొత్త అధ్యాయం.. హై టెక్నాలజీతో ల్యాండ్ సర్వే..
ఏపీలో హై ఎండ్ హై టెక్ టెక్నాలజీతో భూముల సర్వే జరుగుతోందని. దేశంలోనే తొలిసారిగా మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని సీఎం జగన్ అన్నారు.
Land Survey in Andhra Pradesh: ఏపీలో హై ఎండ్ హై టెక్ టెక్నాలజీతో భూముల సర్వే జరుగుతోందని. దేశంలోనే తొలిసారిగా మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు పత్రాలు అందించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా చేపట్టిన సమగ్ర భూముల రీ సర్వే ఏపీలో జరుగుతోంది. ఎన్నో ఆటంకాలు, వ్యయ ప్రయాసలను అధిగమించి తొలిదశలో 2 వేల గ్రామాల్లో పూర్తి చేసింది. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చారు. సర్వే పూర్తైన గ్రామాల భూ రికార్డులను రాష్ట్ర ప్రభుత్వం జియో కో–ఆర్డినేట్స్ అక్షాంశాలు, రేఖాంశాలతో జారీ చేస్తుంది. ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, భూహక్కు పత్రం, ప్రాపర్టీ పార్సిల్ మ్యాప్, ప్రతి గ్రామానికి రెవెన్యూ విలేజ్ మ్యాప్ జారీ చేస్తారు. ప్రతి భూ కమతానికి ఆధార్ నెంబర్ తరహాలో ఐడీ నెంబర్, క్యూఆర్ కోడ్ కేటాయిస్తారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో పొందుపరిచే ఈ కోడ్ను స్కాన్ చేస్తే ఆ భూమికి సంబంధించిన అన్ని వివరాలు లభ్యమవుతాయి.
రీ సర్వే తర్వాత జారీ చేసే డిజిటల్ రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్ చేయడం సాధ్యపడదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డుల్లో మార్పు చేయడం అసాధ్యం. డబుల్ రిజిస్ట్రేషన్కు ఆస్కారం ఉండదు. రీ సర్వే ద్వారా భూ రికార్డుల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన కానుంది. అత్యంత పకడ్బందీగా భూముల కొత్త రికార్డు తయారవుతోంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ వివాదాలు పరిష్కారమవుతాయి. భూ అక్రమాలకు తావుండదు. తొలిదశ కింద రీ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో 4లక్షల 30వేల పట్టా సబ్ డివిజన్లు చేశారు. 2 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. సాధారణంగా పట్టా సబ్ డివిజన్, మ్యుటేషన్ కోసం పట్టే సమయం, తిప్పలు ఇప్పుడు ఉండవు. దీని కోసం రైతుల నుంచి చిల్లిగవ్వ తీసుకోకుండా ప్రభుత్వం పూర్తి చేస్తోంది. పట్టా సబ్ డివిజన్ కోసం సచివాలయం, మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 600 చెల్లించాలి. మ్యుటేషన్ కోసం అయితే 100 కట్టాలి.
2020 డిసెంబర్ 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అత్యంత ఆధునిక సర్వే టెక్నాలజీతో విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యుస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్, జీఎన్ఎస్ఎస్ రోవర్లతో కేవలం 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో రైతులు సంతృప్తి చెందేలా సర్వేను నిర్వహిస్తున్నారు. 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్టాత్మక రీ సర్వే నిర్వహణకు వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. భూముల హద్దులను నిర్థారించి భూరక్ష సర్వే రాళ్లను ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. దేశంలోనే మొదటిసారిగా భూములకు సంబంధించిన అన్ని సేవలను సింగిల్ డెస్క్ విధానంలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తెచ్చారు. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ లాంటి అన్ని సేవల్ని పొందే సౌలభ్యం కల్పించారు.
రీ సర్వే మహాయజ్ఞంలో సర్వే ఆఫ్ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్ పరిపాలన, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు, ఉద్యోగులు అలుపెరగకుండా పని చేస్తున్నారు. ఆధునిక సర్వే టెక్నాలజీలపై సర్వే సెటిల్మెంట్ శాఖ నియమించిన 10,185 మంది గ్రామ సర్వేయర్లకు 70కిపైగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. రీ సర్వేలో అందే అభ్యంతరాలు, వినతులను పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్ బృందాలను నియమించి ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నారు. డిసెంబర్ 2023 నాటికి సర్వే పూర్తి చేసి.. 7,92,238 మందికి భూహక్కు పత్రాలు ఇవ్వలన్నదే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..