‘దిశ’ యాప్పై సీఎం జగన్ సమీక్ష.. ప్రత్యేక చర్యల ద్వారా నేరాలు తగ్గాయన్న అధికారులు.. వాటిపై కీలక ఆదేశాలిచ్చిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో 'దిశ' చట్టం అమలుపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ‘దిశ’ చట్టం పటిష్టంగా అమలు
ఆంధ్రప్రదేశ్లో ‘దిశ’ చట్టం అమలుపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ‘దిశ’ చట్టం పటిష్టంగా అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎంకు అధికారులు వివరించారు. ‘దిశ’ అమలు, మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక దృష్టి కారణంగా 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు తెలిపారు. 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేశామన్నారు. 080 కేసుల్లో 15 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేయగా 103 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయని అధికారులు వివరించారు.
రాష్ట్రంలో సైబర్ బుల్లీయింగ్పై 1531 కేసులు పెట్టామని చెప్పారు. లైంగిక వేధింపులకు పాల్పడ్డ కేసుల్లో 823 కేసులు నమోదయ్యాయి. గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ 1,40,415 మంది డేటాను క్రోడీకరించామని అధికారులు వివరించారు. సైబర్ మిత్ర ద్వారా 2,750 పిటిషన్లు స్వీకరించామని, 374 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని సీఎంకు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 12 లక్షల మంది దిశ యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. యాప్ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 154 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని వెల్లడించారు. మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దిశ తరహా కార్యక్రమాలను చేపట్టాయని, దిశ దర్యాప్తు (పెట్రోలింగ్) వాహనంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించిన విషయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా ఛార్జిషీటు దాఖలు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అందుకు తగ్గట్లు వ్యవస్థను తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. దర్యాప్తునకు అనుసరించే ప్రక్రియలో మౌలిక సదుపాయాల పరంగా సమస్యలు ఏమైనా ఉంటే దానిపై పూర్తి స్థాయి దృష్టిపెట్టాలన్నారు.
దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలని సీఎం జగన్ కోరారు. అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు కావాలని అధికారులను ఆదేశించారు. మొబైల్ ఫోన్ల సెక్యూరిటీ కోసం ప్రారంభించిన సైబర్ కియోస్క్ మంచి ఫలితాలను ఇస్తున్నాయని అధికారులు పేర్కొనగా, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై పలు సూచనలు కియోస్క్ వద్ద పెట్టాలని సీఎం సూచించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్దే కాకుండా విద్యా సంస్థల వద్ద కూడా కియోస్క్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ కియోస్క్లకు ‘దిశ’ పేరే పెట్టాలని సూచించారు. ఫోరెన్సిక్ ల్యాబ్లపైనా సీఎం సమీక్షించారు. తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
దిశ యాప్ – ప్రచారం:
దిశ పోలీస్ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు, రక్షణ, భద్రత అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్ పెట్టాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులతో అనుసంధానం కావాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు దిశ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు, ఏఎన్ఎంలకు కూడా దిశ యాప్పై అవగాహన కల్పించాలన్నారు. దిశ యాప్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లు, హోర్డింగ్స్ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
దిశ ఎస్ఓఎస్ ఎలా పని చేస్తోందని అధికారులను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. దిశ ఎస్ఓఎస్ నుంచి కాల్ వచ్చిన వెంటనే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అక్కడ ఉంటున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. సగటున 6 నిమిషాల్లోగా చేరుకుంటున్నామని పోలీసులు ముఖ్యమంత్రి వద్ద వెల్లడించారు. కొన్ని ఘటనల విషయంలో కౌన్సిలింగ్ చేస్తున్నామని అధికారులు తెలపడంతో ఇలాంటి ఘటనల్లో ఫిర్యాదులు చేసిన మహిళలకు క్రమం తప్పకుండా కాల్స్ వెళ్లాలని సీఎం సూచించారు. వారి సమస్య తీరిందా? లేదా? అన్నదానిపై వారి నుంచి తప్పనిసరిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్లు కృతికా శుక్లా, దీపికా పాటిల్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్నితో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.