AP Weather: ట్విస్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. అక్కడ ఎండలు.. ఇక్కడ వానలు
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు అన్ని ప్రాంతాల్లో విస్తరించలేదని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. దీంతో పలు ప్రాంతాల్లో ఎండలు, వడగాలులు ఉంటాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాలలో నైరుతి రుతపవనాలు ఇంకా పూర్తిగా వ్యాపించలేదు. దీంతో రెండు రోజులుగా ఎండలు మండుతున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు పూర్తిగా వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపింది. సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో కోస్తా ఆంధ్ర ప్రదేశ్కు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. గోవా నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో బలహీన పడ్డ తూర్పు-పడమర ద్రోణి ఉంది. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు కొన్నిచోట్ల అడపా దడపా వర్షాలు కురిసినప్పటికీ… ఇతర ప్రాంతాల్లో ఎండలు, వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని.. భారీవర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 19, గురువారం అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..