AP High Court on SEC: హైకోర్టులో ఎస్ఈసీ నీలం సాహ్నికి ఊరట.. పిల్ ఉపసంహరించుకున్న పిటిషనర్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్ను విత్డ్రా చేసుకున్నట్లు హైకోర్టుకు తెలిపారు.
AP High Court on SEC Neelam Sahni: రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషనర్ తన పిల్ను విత్డ్రా చేసుకున్నట్లు అతడి తరఫు న్యాయవాది గురువారం రాష్ట్ర హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ డిస్పోజ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వారం రోజుల క్రితం నీలం సాహ్ని నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో పిటిషన్దారు తన పిల్ను ఉపసంహరించుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల ప్రధానాధికారిగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్కుమార్ పదవీ కాలం ముగియనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం.. ముగ్గురు రిటైర్ ఐఏఎస్ల అధికారుల పేర్లతో కూడిన ప్రతిపాదనను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్కు పంపింది. ఎస్ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను పంపగా…నీలం సాహ్నిని ఎంపిక చేశారు. దీంతో నీలం సాహ్నీని రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ ఆమోదం తెలిపారు.
1984 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన నీలం సాహ్ని.. ఏపీ సీఎం ముఖ్య సలహాదారుగా వ్యవహరించారు. అంతకు ముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు నీలం సాహ్నీ. మచిలీపట్నం అసిస్టెంట్ కలెక్టర్గా, టెక్కలి సబ్కలెక్టర్గా, నల్గొండ జేసీగా పనిచేశారు. ఆ తర్వాత పలు ప్రభుత్వ శాఖల్లో కార్యదర్శి హోదాలో విధులు నిర్వర్తించారు. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆమె.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
కుటుంబ సంక్షేమ శాఖలో పలు విభాగాల్లో పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఏపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విమరణ పొందారు. మరో రెండేళ్ల పాటు సలహాదారుగా ఉంటారు. అయితే అంతలోనే అనూహ్యంగా ఎస్ఈసీగా నియమించడం విశేషం.