Andhra Pradesh: బడుగుజీవులను మింగేసిన పిడుగు.. నలుగురు స్పాట్ డెడ్.. మరో ముగ్గురు
ఏలూరు జిల్లాలో బడుగు జీవులు బ్రతుకులు కూలిపోయాయి. లింగపాలెం మండలం బోగోలులో రాత్రి పిడుగుపాటుకు గురై నలుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Lightning Strike Eluru: వారంతా నిరుపేదలు. రెక్కాడితేగాని డొక్కాడని బడుగుజీవులు. జామాయిల్ కర్రలను నరికే పనికి వెళ్లారు. పని ముగించుకున్న కూలీలు అక్కడే ఏర్పాటు చేసుకున్న డేరాల్లో బుక్కెడు తిని నిద్రించారు. అలసిపోవడంతో గాఢనిద్రలోకి వెళ్లారు. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీశబ్దంతో డేరాలపై పిడుగు పడింది. పిడుగుధాటికి కూలీల బతుకులు ఛిద్రమయ్యాయి. ఏం జరిగిందో తెలిసేలోపే నలుగురు మృతిచెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారు ఏసు, వెంకటస్వామి, అర్జున్గా గుర్తించారు. విజయవాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏలూరు జిల్లా(Eluru district) లింగంపాలెం మండలం(Lingapalem Mandal) బోగోలులో జరిగిన విషాదంతో తోటికూలీలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులను రాయుడు, శ్రీనివాస్, గుత్తుల కొండబాబు, వరుకుల ధర్మరాజుగా గుర్తించారు. జామాయిల్ కర్రలను నరికేందుకు మొత్తం 35 మంది వచ్చినట్లు చెబుతున్నారు కూలీలు. పనిముగించుకుని అక్కడే ఏర్పాటు చేసుకున్న డేరాల్లో నిద్రపోమామన్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పెద్దశబ్దం వచ్చిందని.. లేచిచూసేసరికే ఘోరం జరిగిపోయిందని కన్నీటిపర్యంతమవుతున్నారు. కూలీలు మూడ్రోజులుగా ప్లాంటేషన్లో పనిచేస్తున్నట్లు చెప్పారు డీఎఫ్వో సత్యగౌరి. అర్ధరాత్రి పిడుగుపడడతో నలుగురు చనిపోయినట్లు చెప్పారు. మరో నలుగురు గాయపడినట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..