Free Bus Scheme: ఇకపై పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకం.. ఏపీలోనే.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఉచిత బస్సు పథకంపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులో ఉంది. అయితే ఇక నుంచి ఇంద్రధనస్సు పథకాన్ని అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం స్త్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూటమి సర్కార్ కల్పిస్తోన్న విషయం తెలిసిందే. జీరో టికెట్ ద్వారా మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఉచిత బస్సు ప్రయాణ పథకంపై చంద్రబాబు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు కూడా ఫ్రీ బస్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుండగా.. దీని అమలుతో ఇక నుంచి దివ్యాంగులైన పురుషులు కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిని అమలు చేసేందుకు ఆమోదముద్ర వేసింది.
నిబంధనలు ఇవే..
40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో టికెట్పై 50 శాతం రాయితీ మాత్రమే దివ్యాంగులకు అందిస్తున్నారు. ఇకపై ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే ఉచిత బస్సు ప్రయాణం వర్తించని నాన్ స్టాప్, అంతరాష్ట్ర, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 50 శాతం రాయితీ కొనసాగుతుంది. దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు పరిశీలించిన అనంతరం జీరో టికెట్ జారీ చేస్తారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందించే ఈ పథకానికి ఇంద్రధనస్సు అనే పేరును ఖరారు చేశారు. మహిళలకు ఏయే బస్సుల్లోవ ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందో.. అదే కేటగిరీ బస్సుల్లో దివ్యాంగులు కూడా ఫ్రీ జర్నీ చేయవచ్చు. స్త్రీ శక్తి పథకం వర్తించని బస్సుల్లో దివ్యాంగులకు ఎప్పటిలాగే రాయితీ సౌకర్యం ఉంటుంది. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇంది పెద్ద ఊరటగా చెప్పవచ్చు.
కేబినెట్ కీలక నిర్ణయాలు
-పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను పర్యావరణం అటవీశాఖగా మార్పు -ఏపీ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లు-2026కు ఆమోదం -కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య సరిహద్దుల క్రమబద్దీకరణకు ఆమోదం -కొత్తగా సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ ఏర్పాటు -విశాఖపట్నం, తిరుపతి, సత్యసాయి, చీరాల, రాజమండ్రి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు ఆమోదముద్ర -సోలార్, హైడ్రో, హైబ్రిడ్ ప్రాజెక్టులకు ఆమోదం -విశాఖపట్నంలో రూ.2,387 కోట్లతో సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ఆమోదం -ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఫిబ్రవరి 28వ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయం
