Amith Shah: 8న విశాఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ.. ఏపీపై బీజేపీ అగ్రనాయకత్వం ఫోకస్..
బీజేపీ అగ్రనాయకత్వం ఏపీపై ఫోకస్ పెట్టిందా..? ఈ నెలలో ఇద్దరు అగ్రనేతల పర్యటన దేనికి సంకేతం..? ఢిల్లీ పెద్దల రాకతో పొత్తులపై క్లారిటీ వస్తుందా..? ఇంతకీ ఏపీ విషయంలో కమలనాథుల ఆలోచన ఏంటి?
ఏపీలో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే వైసీపీ, టీడీపీ వేడి రగిలిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. ఈనెల 8న విశాఖలో అమిత్ షా భారీ బహిరంగ సభ.. 10న వచ్చే జేపీ నడ్డాతో తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీజేపీ అగ్రనేతల పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇప్పటికే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు ఉంటుందా.. లేదా అనే చర్చ నడుస్తోంది. ఏపీ బీజేపీ నేతలు పదే పదే ఈ అంశానికి సమాధానం ఇవ్వక తప్పడం లేదు. పవన్ కల్యాణ్ తమతోనే ఉన్నారని.. జనసేనతోనే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ నేతలు చెబుతున్నా.. పవన్ కల్యాణ్ ఆలోచనలు మరోలా ఉన్నాయి.
పవన్ అభిప్రాయలను ఢిల్లీ బీజేపీ పెద్దలకు చెప్పామని ఇప్పటికే స్పష్టం చేయడంతో.. అమిత్ షా, నడ్డాల పర్యటనలో ఆ అంశంపై ఏదైనా క్లారిటీ వస్తుందా లేదా అన్నది ప్రశ్న. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటై 9 ఏళ్లు అయిన సందర్భంగా విశాఖ, తిరుపతిల్లో సభలు ఏర్పాటు చేశామని వీర్రాజు అండ్ కో చెబుతున్నా.. రాజకీయ కదలికలు ఉంటాయా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
విశాఖ, తిరుపతినే ఎందుకు ఎంచుకున్నారంటే
బీజేపీ అగ్రనేతల పర్యటనలో విశాఖ, తిరుపతిని ఎంచుకోవడం కూడా చర్చగా మారింది. గతంలో ఈ రెండు చోట్ల బీజేపీ ఎంపీలు గెలిచారు. మళ్లీ అక్కడ పాగా వేయాలన్నది బీజేపీ పెద్దల ఆలోచనా లేక ఇంకేదైనా ఉందా అన్నది తెలియాలి. ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేకంగా పదివేల కోట్లు మంజూరు చేసింది కేంద్రం. అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి డెడ్లైన్లు పెడుతోంది. వీటన్నింటినీ చూశాక.. ఏపీలో బీజేపీ స్పీడ్ పెంచిందనేవాళ్లూ ఉన్నారు. మరి.. బీజేపీ అగ్రనేతల పర్యటనతో ఏపీలో ఎలాంటి రాజకీయ మార్పులు జరుగుతాయో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం