Davos: ఏపీ ఉజ్వల భవిష్యత్కు నిర్మాణాత్మక పునాదులు.. దావోస్లో కీలక ఒప్పందాలు..
దావోస్( Davos) వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏపీ(AP) ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రం ఎంఓయూలు కుదుర్చుకుంది...
దావోస్( Davos) వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏపీ(AP) ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రం ఎంఓయూలు కుదుర్చుకుంది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి 1.25కోట్ల పెట్టబడులపై అదానీ(adani), గ్రీన్కో, అరబిందోలతో ఒప్పందం కుదర్చుకుంది. దీని ద్వారా 27,700 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి అందుబాటులోకి రాబోతోంది. పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్ సభలో సీఎం దృష్టిపెట్టారు. దస్సాల్ట్ సిస్టమ్స్, మిట్సుయి, ఒ.ఎస్.కె.లైన్స్తోనూ జరిగిన చర్చల్లో సీఎం ఇవే అంశాలపై దృష్టిపెట్టారు. హై ఎండ్ టెక్నాలజీ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ రంగంలో పెట్టబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హై ఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపైనా చర్చించారు. యూనికార్న్ స్టార్టప్స్కూ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్ వేదికగా గట్టి ప్రయత్నాలు చేశారు. వివిధ యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్లో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్ ప్రకటించింది.
ఇటు తెలంగాణకు కూడా పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణలో 1,400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు హ్యుండై CIO ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు చెప్పారు. ఇదే కాకుండా తెలంగాణ మొబిలిటీ వ్యాలీలో భాగస్వామిగా ఉండేందుకు ముందుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొబిలిటీ రంగంలో హ్యుండై పెట్టుబడి గొప్ప బలాన్ని ఇస్తుందన్నారు కేటీఆర్. దేశంలో తొలిసారిగా ఒక మొబిలిటీ వ్యాలీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మాస్టర్ కార్డ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్లో మాస్టర్ కార్డ్ వీసీ, ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమెన్, మంత్రి కేటీఆర్ మధ్య ఈ డీల్ కుదిరింది. మాస్టర్ కార్డ్తో ఒప్పందంతో రాష్ట్రంలో పౌర సేవలను చాలా స్పీడ్గా డిజిటైజ్ చేయవచ్చన్నారు కేటీఆర్. డిజిటల్ స్టేట్ పార్ట్నర్షిప్లో భాగంగా మాస్టర్ కార్డ్తో కీలక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం పనిచేస్తుందన్నారు.