Konaseema Violence: అమలాపురంలో కొనసాగుతున్న ఆంక్షలు.. మరో 48 గంటలపాటు ఇంటర్నెట్ నిలిపివేత
కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ప్రకటన విడుదల చేశారు. అమలాపురం అల్లర్ల కేసులో ఇప్పటి వరకు మొత్తం 91మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
Konaseema District Rename Violence: కోనసీమ అల్లర్ల ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అమలాపురం ఘటనపై పోలీసులు ఇప్పటికే పలు కేసులు నమోదు చేసి.. విడతల వారీగా 71 మందిని అరెస్టు చేశారు. తాజాగా.. గురువారం మరో 20 మంది నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ప్రకటన విడుదల చేశారు. అమలాపురం అల్లర్ల కేసులో ఇప్పటి వరకు మొత్తం 91మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు. గత నెల 24వ తేదీన అమలాపురంలో జరిగిన అల్లర్ల కేసులో మొత్తం 7 కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో.. నిందితుల గుర్తింపు, అరెస్ట్ కోసం ఏడు దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నాయి.
ఇదిలాఉంటే.. కోనసీమలోని ఎనిమిది మండలాల్లో మరో 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలయిన అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ముమ్మిడివరం మండలాల్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత కొనసాగుతుందని తెలిపారు.
గత నెల 24వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. నిరసనకారులు.. కలెక్టరేట్, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇళ్లకు నిప్పు పెట్టారు. దీంతోపాటు మూడు బస్సులు, పలు వాహనాలను ధ్వసం చేసి నిప్పుపెట్టారు. దీంతో కోనసీమ జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..