China-India dispute: భారత్ – చైనా సరిహద్దు ఉద్రిక్త పరిస్థితులపై సంచలన విషయాలు బయటపెట్టిన అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టు
US intelligence report : భారత్ - చైనా మధ్య నెలకొన్న పరిస్థితులపై అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టు బయటికొచ్చింది. ఈ నివేదికలో అత్యంత కీలక అంశాలను ప్రస్తావించారు.
US intelligence report : భారత్ – చైనా మధ్య నెలకొన్న పరిస్థితులపై అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టు బయటికొచ్చింది. ఈ నివేదికలో అత్యంత కీలక అంశాలను ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగిపోయాయని సదరు రిపోర్ట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, చైనా, భారత భూభాగాన్ని ఆక్రమిస్తోందంటూ సంచలన విషయాలు చెప్పారు. ఒక వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి భయోత్పాతం సృష్టిస్తోన్న వేళ డ్రాగన్ కంట్రీ గతేడాది ‘చైనా – ఇండియా’ బోర్డర్లోని సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలకు చెందిన సైనికులు ఎముకలు కొరికే చలిలో యుద్ధానికి దిగి ప్రాణాలు కోల్పోయారు. దీనిని ప్రముఖంగా అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొంది. దశాబ్దాలలోనే ఈ చైనా చర్య అత్యంత తీవ్రమైనదంటూ వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభం నుంచీ కూడా ఢిల్లీ – బీజింగ్ మధ్య పరిస్థితుల్లో పెద్దగా మార్పురాలేదని యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజెన్స్ నివేదిక తెలిపింది. కాగా, ఈ ఏడాది ఆరంభం జనవరిలోనూ డ్రాగన్ కంట్రీ దుర్మార్గాలకు ఒడిగట్దింది.
ఉత్తర సిక్కింలోని నాథులా లోయ సరిహద్దుల్లో భీకరమైన పోరాటం జరగడం… భారత సైన్యం గట్టిగా పోరాడటంతో… చైనా సైనికులు దాదాపు 30 మంది ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. ఇలా ఉంటే, తాజా యుఎస్ ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (ODNI) రిపోర్ట్ ప్రకారం, ఇరుదేశాల మధ్య పరస్పరం అనేక మార్లు చర్చలు జరగడంతో, ఇటీవల భారత – చైనా సరిహద్దుల్లోని పలు ప్రాంతాల నుంచి బలగాలను, ఆయుధ సామగ్రిని ఇరుదేశాలు వెనక్కి తీసుకుంటున్నాయని కూడా సదరు నివేదిక పేర్కొంది.