IND W vs SL W T20I : వరల్డ్ కప్ కప్పు కొట్టాక మొదటి మ్యాచ్..శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
IND W vs SL W T20I : ఇటీవలే వన్డే ప్రపంచకప్ను ముద్దాడి యావత్ భారతదేశం గర్వపడేలా చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు, ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమైంది. నేడు (ఆదివారం, డిసెంబర్ 21) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్తో ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఘనంగా ప్రారంభం కానుంది.

IND W vs SL W T20I : ఇటీవలే వన్డే ప్రపంచకప్ను ముద్దాడి యావత్ భారతదేశం గర్వపడేలా చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు, ఇప్పుడు పొట్టి ఫార్మాట్లో తన విశ్వరూపాన్ని చూపించడానికి సిద్ధమైంది. నేడు (ఆదివారం, డిసెంబర్ 21) ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్తో ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఘనంగా ప్రారంభం కానుంది. సొంతగడ్డపై అది కూడా విశాఖ అభిమానుల మధ్య జరుగుతున్న మ్యాచ్ కావడంతో టీమిండియా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
ప్రపంచకప్ సన్నాహకాలకు వేదిక
వచ్చే ఏడాది ఇంగ్లాండ్లో జరగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ సిరీస్ను అత్యంత కీలకంగా భావిస్తోంది. జూన్ 12 నుంచి ప్రారంభం కానున్న ఆ మెగా టోర్నీకి ముందు మన జట్టులోని బలాబలాలను పరీక్షించుకోవడానికి, సరైన తుది జట్టును రూపొందించడానికి హర్మన్ప్రీత్ కౌర్కు ఇది ఒక గొప్ప అవకాశం. వన్డే ప్రపంచకప్ గెలిచిన ఊపులో ఉన్న భారత అమ్మాయిలు, అదే ఆధిపత్యాన్ని టీ20ల్లోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉన్నారు.
స్టార్ ప్లేయర్లపైనే అందరి కళ్లు
విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ పోరులో ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మల బ్యాటింగ్ హైలైట్గా నిలవనుంది. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటర్ షెఫాలీ వర్మ తన ట్రేడ్మార్క్ సిక్సర్లతో లంక బౌలర్లపై విరుచుకుపడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ మిడిల్ ఆర్డర్లో వెన్నెముకలా నిలవనుండగా, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మలు తమ ఆల్రౌండ్ ప్రతిభతో జట్టుకు అండగా నిలవనున్నారు.
జట్టులోకి కొత్త రక్తం
ఈ సిరీస్ కోసం సెలెక్టర్లు అనుభవంతో పాటు యువతకు పెద్దపీట వేశారు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన వైష్ణవి శర్మ, జి.కమలిని తొలిసారి భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. వీరిద్దరికీ ఈ సిరీస్లో తుది జట్టులో అవకాశం దక్కితే తమను తాము నిరూపించుకోవడానికి ఇదొక సువర్ణావకాశం. రేపు ప్రపంచకప్ రేసులో ఉండాలంటే వీరు ఈ సిరీస్లో అసాధారణ ప్రతిభ చూపాల్సి ఉంటుంది.
రికార్డులు ఏం చెబుతున్నాయి?
చమరి ఆటపట్టు సారథ్యంలోని శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయలేం. అయినప్పటికీ, గణాంకాలు మాత్రం భారత్కే మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటివరకు భారత్, శ్రీలంక జట్లు మొత్తం 26 టీ20 మ్యాచ్ల్లో తలపడగా.. టీమిండియా ఏకంగా 20 మ్యాచ్ల్లో జయకేతనం ఎగురవేసింది. శ్రీలంక కేవలం 5 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించగా, ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. లంకపై భారత్కు ఉన్న ఈ ట్రాక్ రికార్డ్ ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
లైవ్ వివరాలు ఇవే
క్రికెట్ ప్రేమికులు ఈ రసవత్తర పోరును టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానళ్లలో వీక్షించవచ్చు. మొబైల్ వినియోగదారులు జియో హాట్ స్టార్ యాప్, వెబ్సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ను ఆస్వాదించవచ్చు. రాత్రి 6:30 గంటలకు టాస్ పడనుండగా, సరిగ్గా 7:00 గంటలకు మొదటి బంతి పడనుంది.
భారత మహిళల జట్టు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, అమన్జోత్ కౌర్, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, ఎన్. శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, జి. కమలిని.
శ్రీలంక మహిళల జట్టు: చమరి అథాపత్తు (కెప్టెన్), విష్మి గుణరత్నే, హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, కవిషా దిల్హారి, నిలాక్షి డి సిల్వా, కౌశాని నుత్యాంగన (వికెట్ కీపర్), రష్మిక సెవ్వండి, ఇమేశా దులాని, కావ్య కవింది, నిమేషా మధుషాని, మాల్కీ మదార, ఇనోకా రణవీర, మల్షా షెహాని, శశిని గిమ్హాని.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




