AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్.. తాలిబాన్లతో మోదీ సర్కార్ కీలక ఒప్పందం!

ఆఫ్ఘనిస్తాన్‌కు సహాయం చేసేందుకు భారత్ సుముఖత వ్యక్తం చేసింది. దుబాయ్ వేదికగా రెండు దేశాల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్ వైమానిక దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించిన రెండు రోజుల తరువాత మిస్రీ సమావేశం జరగడం విశేషం. అయితే, త కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ మానవతా సహాయం అందిస్తోంది.

పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్.. తాలిబాన్లతో మోదీ సర్కార్ కీలక ఒప్పందం!
Vikram Misri, Mawlawi Amir Khan Muttaqi
Mahatma Kodiyar
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 09, 2025 | 7:20 PM

Share

అఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం వ్యూహాత్మక చర్చలు జరిపింది. ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ నౌకాశ్రయం ద్వారా అఫ్ఘనిస్తాన్ సహా మధ్య ఆసియా దేశాలతో వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్న భారతదేశానికి, తాలిబన్లతో జరిగిన చర్చలు కీలక ముందడుగు పడింది. జనవరి 8న దుబాయ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్ ముత్తాకి మధ్య జరిగిన సమావేశంలో ప్రాంతీయ సహకారం, పరస్పర అభివృద్ధి తదితర అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరిగాయి.

‘చాబహార్’ ప్రాజెక్ట్: 

ఇరాన్‌లో ఉన్న చాబహార్ పోర్టు భారతదేశానికి వ్యూహాత్మక ప్రాజెక్ట్. అఫ్ఘనిస్తాన్ సహా మధ్య ఆసియా దేశాలకు చేరుకోవాలంటే భౌగోళికంగా పాకిస్తాన్‌ను దాటుకుని వెళ్లాల్సిందే. కానీ ఆ దేశం భారత్‌తో చెలిమి కంటే శత్రుత్వాన్నే కోరుకుంటూ నిత్యం కుట్రలకు పాల్పడుతున్న నేపథ్యంలో.. ఆ దేశానికి అవతలివైపున ఉన్న మధ్య ఆసియా దేశాలతో భారత్ జరిపే వాణిజ్యానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌లోని ‘చాబహార్’ పోర్టు ఆయా దేశాలకు నేరుగా కనెక్టివిటీని ఏర్పరుస్తోంది. ఇది పాకిస్తాన్‌ను దాటుకుని, ఆఫ్ఘనిస్తాన్ సహా మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి భారతదేశానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది. ఈ ఓడరేవును భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయం అందించడానికి కూడా ఉపయోగిస్తోంది.

చాబహార్ వల్ల ప్రయోజనాలు

1. ఆర్థిక, వాణిజ్యానికి మార్గం:

చాబహార్ ద్వారా, భారతదేశం తన ఎగుమతులను ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు రవాణా చేయగలదు. ఈ మార్గం భారతదేశ అంతర్జాతీయ వాణిజ్యాన్ని పెంచుతుంది. ఆయా దేశాల నుంచి జరిగే దిగుమతులకు కూడా మార్గం సుగమమవుతుంది.

2. పాకిస్తాన్‌ ప్రమేయం:

చాబహార్ ప్రాజెక్ట్ భారతదేశాన్ని పాకిస్తాన్ భౌగోళిక రాజకీయ పరిమితుల నుండి విముక్తి చేస్తుంది. ఆ దేశం దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా మధ్య ఆసియా దేశాలతో నేరుగా వాణిజ్యం జరుపుకోడానికి ఆస్కారం ఏర్పడుతుంది.

3. ఇంధన భద్రత:

ఈ ప్రాజెక్టు భారతదేశానికి మధ్య ఆసియాలోని ఇంధన వనరులను సులభంగా అందుబాటులోకి తెస్తుంది. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న మధ్య ఆసియా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారతదేశానికి చాబహార్ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.

4. భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు:

ఇది భారత్-ఆఫ్ఘనిస్తాన్, భారత్-ఇరాన్‌లతో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.

తాలిబన్లతో భారత్ సమావేశంలో ఏం జరిగింది?

దుబాయ్‌లో జరిగిన సమావేశంలో, భారతదేశం తాలిబాన్ పాలకులతో అనేక అంశాలపై చర్చించింది. మానవతా సహాయం కింద, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు మందులు, ఆహార ధాన్యాలు, టీకాలు ఇతర సామగ్రిని అందిస్తామని హామీ ఇచ్చింది. రెండు దేశాల మధ్య క్రీడలు, సాంస్కృతిక సహకారాన్ని పెంచడానికి, క్రికెట్ వంటి క్రీడలలో సహకారాన్ని పెంచడానికి ఒక ఒప్పందం కుదిరింది. వాణిజ్యం, మానవతా సహాయం కోసం ఇరాన్‌కు చెందిన చాబహార్ వినియోగాన్ని పెంచడానికి ఒక ఒప్పందం కుదిరింది.

పాకిస్తాన్ కు స్పష్టమైన సందేశం

చాబహార్ ప్రాజెక్టు పాకిస్తాన్‌కు వ్యూహాత్మక ఎదురుదెబ్బ. ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్ క్రియాశీలంగా వ్యవహరించడం, తాలిబాన్ పాలకులతో సత్సంబంధాలు పాకిస్తాన్ పాత్రను బలహీనపరిచాయి. గత వారం ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులను భారతదేశం విమర్శించడం గమనార్హం. ప్రాంతీయ స్థిరత్వానికి కట్టుబడి ఉందనే సందేశాన్నిచ్చే భారత్ ప్రయత్నాలకు ఇది బలోపేతం చేస్తోంది.

చాబహార్ ప్రాజెక్టు ప్రస్తుత స్థితి

చాబహార్ నౌకాశ్రయం అభివృద్ధి దశలో ఉంది. ఇప్పటికే భారతదేశం-ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్యంలో దీన్ని రెండు దేశాలు ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు ప్రాజెక్టు అభివృద్ధికి కొన్ని సవాళ్లను సృష్టించాయి. అయినప్పటికీ, భారతదేశం ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిచ్చింది. చాబహార్ పోర్టు కేవలం తాలిబాన్లతో సత్సంబంధాల కోసం మాత్రమే కాదు, మొత్తం మధ్య, పశ్చిమ ఆసియా ప్రాంతాలతో సంబంధాల్లో కూడా కీలకంగా మారనుంది. ఇది భారతదేశ వ్యూహాత్మక పరిధిని పెంచడమే కాకుండా, ప్రాంతీయ స్థిరత్వం, వృద్ధికి కొత్త మార్గాలను తెరవడానికి భారత్ సిద్ధంగా ఉందని చాటి చెప్పనుంది.

గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్థాన్‌కు భారత్ సాయం చేస్తోంది. సమీప భవిష్యత్తులో మానవతా సహాయ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి ప్రాజెక్టుల్లో కూడా పాలుపంచుకోవడాన్ని భారత్ పరిశీలిస్తుంది. గత కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ మానవతా సహాయం అందిస్తోంది. భారతదేశం ఇప్పటివరకు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు, 300 టన్నుల మందులు, 27 టన్నుల భూకంప సహాయ సహాయం, 40,000 లీటర్ల పురుగుల మందులు, 10 కోట్ల డోసుల పోలియో, 15 లక్షల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ వంటి అనేక సరుకులను పంపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..