Emergency in Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ.. తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే బాధ్యతలు..

రాజపక్స రాజీనామా లేఖను సమర్పించకుండా వెళ్లడం.. శ్రీలంకలో కలకలం రేపింది. గోటబయ దేశం విడిచిపెట్టి వెళ్లడంపై ప్రజలు అధికారులపై తిరగబడుతున్నారు. దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి.

Emergency in Sri Lanka: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ.. తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమ సింఘే బాధ్యతలు..
Vikramasinge Sri Lanka
Follow us

|

Updated on: Jul 13, 2022 | 12:24 PM

Emergency in Sri Lanka: శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ప్రజల ఆందోళనలు, ఆగ్రహంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే దేశం విడిచి పారిపోయారు. ఈ రోజు తెల్లవారుజామున ఆయన భార్య సహా ఇద్దరు అంగరక్షకులతో కలిసి ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారైనట్లు వైమానిక అధికారి వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా విషయంలో తనను దేశం వీడి పోయేందుకు అనుమతిస్తేనే.. పదవి నుంచి వైదొలగుతానని గొటబాయ సోమవారం షరతులు పెట్టిన విషయం తెలిసిందే. ప్రజాగ్రహం నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి ఈ నెల 13న వైదొలగుతానని గొటబాయ ఇదివరకే పార్లమెంటు స్పీకర్‌కు, ప్రధాని రణిల్‌ విక్రమసింఘేకు తెలిపారు. అయితే.. రాజపక్స రాజీనామా లేఖను సమర్పించకుండా వెళ్లడం.. దేశంలో కలకలం రేపింది. గోటబయ దేశం విడిచిపెట్టి వెళ్లడంపై ప్రజలు అధికారులపై తిరగబడుతున్నారు. దేశంలో ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. శ్రీలంకలో హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. గోటబయ పారిపోయిన అనంతరం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. వెంటనే దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక ఆర్మీ సైతం రంగంలోకి దిగింది. అధ్యక్షుడి బంగ్లాలో నిరసన తెలుపుతున్న ప్రజలపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. బంగ్లాను విడిచి వెళ్లాలంటూ హెచ్చరించారు. అయినప్పటికీ నిరసనకారులు అక్కడినుంచి కదలడం లేదు. దీంతోపాటు ప్రధాని, పార్లమెంటు తదితర ప్రాంతాల్లో కూడా నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతూ పోలీసులపై తిరగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స విదేశాలకు పారిపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. రాజపక్స రాజీనామా అంశాన్ని స్పీకర్‌ ప్రకటిస్తే.. శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు విపక్ష పార్టీలైన ఎస్‌జేబీ, SLF నేతలు సంప్రదింపులు ముమ్మరం చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు ఎస్‌జేబీ నేత సాజిత్‌ ప్రేమదాస ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఆయనకు మద్దతను కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శ్రీలంక రాజ్యాంగం ప్రకారం దేశ అధ్యక్షుడు, ప్రధాని రాజీనామాలు చేసిన పరిస్థితుల్లో ఆపద్ధర్మ అధ్యక్షుడిగా పార్లమెంటు స్పీకర్‌ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా పార్లమెంటు సభ్యులు తమలో ఒకరిని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..