AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haiti Earthquake : భూకంపం ధాటికి హైతీ దేశం విలవిల.. 1,300కు పెరిగిన మృతుల సంఖ్య.. క్షతగాత్రులతో నిండిన ఆసుపత్రులు

కరేబియన్‌ ద్వీప దేశం హైతీలో భూకంపం పెను విలయతాండవం సృష్టించింది. భారీ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1,300 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. మరో 2,800 మంది గాయపడ్డారు.

Haiti Earthquake : భూకంపం ధాటికి హైతీ దేశం విలవిల.. 1,300కు పెరిగిన మృతుల సంఖ్య.. క్షతగాత్రులతో నిండిన ఆసుపత్రులు
Haiti Earthquake
Balaraju Goud
|

Updated on: Aug 16, 2021 | 8:02 AM

Share

Haiti Earthquake: కరేబియన్‌ ద్వీప దేశం హైతీలో భూకంపం పెను విలయతాండవం సృష్టించింది. భారీ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1,300 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. మరో 2,800 మంది గాయపడ్డారు. భూకంపం తీవ్రతకు వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు స్థానిక అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. . భాకంపం ధాటికి పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమవడంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. క్షతగాత్రులను రక్షించించేందుకు అమెరికా సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను భారీగా మోహరించింది.

శనివారం తెల్లవారు జామున హైతీలో రిక్టర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. రాజధాని పోర్ట్-ఓ-ప్రిన్స్‌కు పశ్చిమాన 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రికృతమైన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. కాగా, శనివారం రోజంతా ప్రకంపనలు కొనసాగాయి. గత నెల 7న హైతీ దేశ అధ్యక్షుడు జొవెనెల్‌ మోయిస్‌ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఇప్పటికీ ఆ దేశం షాక్‌లో ఉండగా.. భూకంపం మరింత విషాదంలోకి నెట్టింది.

ఆదివారం తెల్లవారు జామున సైతం ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ప్రభావం హైతీలోని అనేక పట్టణాలపై తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ భూకంపానికి వేలాది సంఖ్యలో ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు 1,300 మంది మృతి చెందారని దేశ పౌర రక్షణ సంస్థ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. కరేబియన్‌ ద్వీపం భూకంప తీవ్రతతో తల్లడిల్లిపోయింది. ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తుండగా.. పెను విధ్వంసానికి ఇళ్లు, హోటళ్లు, ఇతర నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. భయంతో ఒక్కసారిగా ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు.

భారీగా మట్టిపెళ్లలు విరిగిపడటంతో శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, సహాయక చర్యలకు కూడా విఘాతం కలుగుతోంది. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. పలుచోట్ల రోడ్లపైన తాత్కాలికంగా వైద్య సహాయం అందిస్తున్నారు. ఎంతోమంది నిరాశ్రయులు కాగా.. భయంతో ప్రజలంతా రాత్రివేళ బిక్కుబిక్కుమంటూ వీధులు, చర్చిల్లో కాలం గడుపుతున్నారు. ఎంతో మంది తమ కుటుంబ సభ్యుల్ని, ఆత్మీయుల్ని, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. ఎవరిని కదిపినా కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఆదివారం ఉదయం ఓ మార్కెట్‌లో పళ్లు, తాగునీరు కొంతమేర అందుబాటులో ఉంచగా.. ప్రజలు ఎగబడ్డారు. చాలామంది స్థానికులు లెస్‌కేయస్‌లోని ఓ ప్రార్థన మందిరంలో తలదాచుకున్నారు. ‘నేటి భూకంపం హైతీకి రాజకీయ అస్థిరత.. హింస, కోవిడ్ -19, పెరుగుతున్న ఆహార అభద్రత మరో ఎదురుదెబ్బ’ అని యాక్టింగ్ హైతీ డైరెక్టర్ కారా బక్‌ పేర్కొన్నారు.భూకంపాలు, హరికేన్లతో హైతీ నిత్యం అల్లాడుతుంటుంది. 2010లో భారీ భూకంపం సంభవించగా దాదాపు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో సహాయక చర్యలు అంత వేగంగా సాగలేదు. 2018లో సంభవించిన మరో భూకంపంలో 12 మందికి పైగా చనిపోయారు.

భూకంప తీవ్రతకు దెబ్బతిన్న ప్రాంతాల్లో హైతీ ప్రధానమంత్రి ఏరియల్‌ హెన్రీ పర్యటించారు. ఈ కష్టకాలంలో ప్రజలంతా సంఘీభావంతో ఉండాలని కోరారు. దేశమంతటా నెల రోజుల పాటు అత్యయిక పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. నష్టం తీవ్రత పూర్తిస్థాయిలో అంచనా వేసేంతవరకు అంతర్జాతీయంగా సాయాన్ని కోరబోమని ఆయన తెలిపారు. ‘‘వీలయినంత మంది కోలుకునేలా చేయడం ఇప్పుడు మాకు అత్యంత ముఖ్యం’’ అని హెన్రీ పేర్కొన్నారు. సుమారు 860 ఇళ్లు నేలకూలినట్లు హైతీ ఉన్నతాధికారి జెర్రీ క్యాండ్‌లర్‌ తెలిపారు. పలుచోట్ల ఆసుపత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, ప్రార్థన మందిరాలు సైతం దెబ్బతిన్నట్లు చెప్పారు. లెస్‌కేయస్‌కు 10.5 కి.మీ.ల దూరంలో ఉన్న ఓ చిన్న ద్వీపంపైనా భూకంపం ప్రభావం పడింది. అధికారులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు తరలివచ్చే రిసార్టు బాగా దెబ్బతింది.

దాదాపు 1.1 కోట్ల జనాభా ఉన్న హైతీపై భూకంపం ‘దెబ్బ మీద దెబ్బ’లా మారింది. కరోనా మహమ్మారి నుంచి కోలుకోక ముందే .. ఇటీవల దేశాధ్యక్షుడి దారుణ హత్యకు గురయ్యాడు. పెరుగుతున్న పేదరికం వంటి సమస్యలతో ఇప్పటికే ఈ దేశం అల్లాడుతోంది. శనివారం భకంపానికి తోడు మరో ముప్పు పొంచి ఉందని అధికారులు తెలిపారు. పెను తుపాను గ్రేస్‌ కూడా హైతీపై ఒకటి, రెండు రోజుల్లో విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు రావడంతో నష్టం మరింత తీవ్రంగా ఉంటుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్‌ దెబ్బకు ఇప్పటికే హైతీలో ఆసుపత్రులు నిండిపోయాయి. మహమ్మారిని ఎదుర్కొనే వనరులు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అమెరికా అందించిన తొలి బ్యాచ్‌ కోవిడ్‌ టీకాలు గత నెలలోనే వచ్చాయి. మరోవైపు గత నెలలో దేశాధ్యక్షుడు జోవెనెల్‌ మోయిస్‌ ఆయన ఇంటిలోనే హత్యకు గురి కావడంతో హైతీలో రాజకీయ అస్థిరత నెలకొంది. నాటి ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన భార్య మార్టిన్‌ మోయిస్‌.. ‘‘మనమంతా సంఘీభావంతో ఉందాం’’ అని ట్విటర్‌లో పిలుపునిచ్చారు.

విలవిలలాడుతున్న హైతీకి సాయం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకొచ్చింది. తక్షణం అవసరమైన చర్యలు చేపట్టేందుకు గాను.. అధ్యక్షుడు జో బైడెన్‌ ‘యూఎస్‌ఎయిడ్‌’ ఉన్నతాధికారి సమాంతా పవర్‌ను నియమించారు. నష్టాలను అంచనా వేయడంతో పాటు కోలుకునేందుకు సహాయం చేయడంలో ‘యూఎస్‌ఎయిడ్‌’ సాయపడుతుందని బైడెన్‌ తెలిపారు. హైతీ ప్రజలకు అమెరికా సన్నిహిత మిత్రదేశంగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు అర్జెంటినా, చిలీ దేశాలు కూడా సాయానికి ముందుకొచ్చాయి. హైతీ ప్రజలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సంఘీభావం తెలిపింది. అత్యవసర వైద్యాన్ని అందించడంలో అండగా ఉంటామని పేర్కొంది.

Read Also… కాబూల్ నుంచి పారిపోయిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని.. రక్తపాతాన్ని నివారించేందుకేనని ప్రకటన

Follow Us