TOP 10 Richest NRIs: సంపన్న భారతీయుల సంగతి సరే.. మరి సంపన్న ప్రవాస భారతీయులు ఎవరో తెలుసా?

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జాబితాను విడుదల చేసిన ఆ సంస్థ 1539 మంది భారతీయ సంపన్నులకు జాబితాలో చోటు కల్పించింది. వారిలో 334 మంది బిలియనీర్లు.

TOP 10 Richest NRIs: సంపన్న భారతీయుల సంగతి సరే.. మరి సంపన్న ప్రవాస భారతీయులు ఎవరో తెలుసా?
Top 10 Richest Nris
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 30, 2024 | 3:27 PM

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచవ్యాప్తంగా సంపన్నుల జాబితాను విడుదల చేసిన ఆ సంస్థ 1539 మంది భారతీయ సంపన్నులకు జాబితాలో చోటు కల్పించింది. వారిలో 334 మంది బిలియనీర్లు. భారత్‌లో అత్యధిక సంఖ్యలో సంపన్నులు ఉన్న నగరాల్లో 92 మంది బిలియనీర్లతో కలిపి మొత్తం 386 మంది సంపన్నులతో ముంబై నగరం మొదటిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ నిలబడగా, హైదరాబాద్ ఈ ఏడాది బెంగళూరును వెనక్కి నెట్టి 3వ స్థానాన్ని ఆక్రమించుకుంది.

హైదరాబాద్‌లో 18 మంది బిలియనీర్లు సహా మొత్తం 104 మంది సంపన్నులు ఉన్నారు. భారతీయ సంపన్నుల్లో గౌతమ్ అదానీ మొదటిస్థానంలో నిలిచారు. సంపన్నుల జాబితాలో అనేక మంది తెలుగు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే ఇప్పుడు అందరికీ ఆసక్తి కలిగిస్తున్న మరో అంశం.. విదేశాల్లో స్థిరపడి, సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయుల జాబితాయే. టాప్ 10 సంపన్న ప్రవాస భారతీయులు ఎవరంటే..?

1. గోపీచంద్ హిందూజా కుటుంబం:

హిందూజా గ్రూప్ సంస్థలను నిర్వహిస్తున్న గోపీచంద్ హిందూజా కుటుంబం మొత్తం ఆస్తుల విలువ భారత కరెన్సీలో రూ. 1.92 లక్షల కోట్లు. ఆ కుటుంబం ప్రస్తుతం యూకే రాజధాని లండన్‌లో నివసిస్తోంది. 2024 టాప్ 10 రిచెస్ట్ ఎన్ఆర్ఐ జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది.

2. ఎల్ఎన్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ:

హిందూజా కుటుంబం తర్వాతి స్థానంలో ఎల్ఎన్ మిట్టల్ అండ్ ఫ్యామిలీ నిలిచింది. వారి సంపద విలువ రూ. 1.6 లక్షల కోట్లుగా లెక్కించారు. ప్రపంచంలో స్టీల్ ఉత్పత్తిలో మొదటి వరుసలో ఉన్న సంస్థల్లో ఒకటైన ‘ఆర్సెలార్ మిట్టల్’ సంస్థకు ఛైర్మన్‌గా ఎల్ఎన్ మిట్టల్ ఉన్నారు. ఈ కుటుంబం కూడా యూకేలోనే నివసిస్తోంది.

3. అనిల్ అగర్వాల్ అండ్ ఫ్యామిలీ:

భారత కరెన్సీలో రూ. 1.1 లక్షల కోట్ల విలువైన ఆస్తులతో అనిల్ అగర్వాల్ కుటుంబం మూడో స్థానంలో నిలిచింది. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడైన అనిల్ అగర్వాల్, సహజ వనరులు, ఖనిజాలను వెలికి తీసే సంస్థగా వేదాంత గ్రూపునకు పేరుంది. ఈ కుటుంబం కూడా యూకేలోనే నివసిస్తోంది.

4. షాపూర్ పల్లోంజి మిస్త్రీ:

157 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంజనీరింగ్, నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి గురించి తెలియనివారు ఉండరు. రూ. 91,400 కోట్ల విలువైన ఆస్తులతో షాపూర్జీ పల్లోంజి మిస్త్రీ సంపన్న ప్రవాస భారతీయుల జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. ఆయన, ఆయన కుటుంబం పశ్చిమ యురోపియన్ దేశం ‘మొనాకో’లో నివసిస్తోంది.

5. జే చౌదరి:

ఇండియన్-అమెరికన్ టెకీ దిగ్గజం జై చౌదరి. క్లౌడ్ సెక్యూరిటీ కంపెనీ Zscaler వ్యవస్థాపకుడు. ఆ సంస్థకు CEOగానూ కొనసాగుతున్నారు. ఆయన మొత్తం సంపద రూ. 88,600 కోట్లు. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ నగరంలో నివసిస్తున్నారు.

6. శ్రీ ప్రకాష్ లోహియా:

పెట్రోకెమికల్, టెక్స్‌టైల్ కంపెనీ ఇండోరమ కార్పొరేషన్ వ్యవస్థాపకుడైన శ్రీప్రకాష్ లోహియా సంపద రూ. 73,100 కోట్లుగా హురున్ సంస్థ లెక్కించింది. ఆయన లండన్ నివాసి.

7. వివేక్ చాంద్ సెహగల్ కుటుంబం:

వివేక్ చాంద్ సెహగల్ రూ. 62,600 కోట్ల సంపదను సంపాదించారు. ఆయన ఆటోమొబైల్ విడిభాగాల తయారీలో ప్రపంచ ప్రసిద్ధ సంస్థ మదర్సన్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు. దుబాయిలో నివసిస్తున్న ప్రవాస భారతీయుడైన వివేక్ చాంద్ సెహగల్ సంపన్నుల జాబితాలో 7వ స్థానంలో నిలిచారు.

8. యూసఫ్ అలీ MA:

లూలు గ్రూప్ చైర్మన్‌గా ఉన్న యూసఫ్ అలీ రూ. 55,000 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ఆయన అబుదాబిలో నివసిస్తున్నారు. లూలు గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా లూలు హైపర్‌ మార్కెట్లను నిర్వహిస్తోంది. లూలు షాపింగ్ మాళ్లు ప్రపంచవ్యాప్తంగా పాపులర్.

9. రాకేష్ గంగ్వాల్ & కుటుంబం:

ఇండిగో ఎయిర్‌లైన్ సహ వ్యవస్థాపకుడైన రాకేష్ గంగ్వాల్ రూ. 37,400 కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ఆయన అమెరికాలోని మయామిలో నివసిస్తున్నారు.

10. రోమేష్ టి వాధ్వాని:

టెక్నాలజీ సేవల కోసం ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సింఫనీ టెక్నాలజీ గ్రూప్‌కి మాజీ ఛైర్మన్ రోమేష్ టి వాధ్వాని. ఆయన నికర ఆస్తుల విలువ రూ. 36,900 కోట్లు. అమెరికా కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో నివసిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..