Hyderabad: భారీ వర్షంలోనూ ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తి.. కాల్వలో ఇరుక్కున్న ఫ్యామిలీ సేఫ్!
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షాలనికి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
![Hyderabad: భారీ వర్షంలోనూ ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తి.. కాల్వలో ఇరుక్కున్న ఫ్యామిలీ సేఫ్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/car-in-nala.jpg?w=1280)
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. పలుచోట్ల కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షాలనికి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో శుక్రవారం(ఆగస్ట్ 16) రాత్రి కురిసిన వర్షానికి పనామా గోడౌన్స్ వద్ద ఓ కారు కాలువలోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ముగ్గురు చిన్నారులతో సహా ఓ కుటుంబాన్ని క్షేమంగా కాపాడారు.
హయత్నగర్ ప్రాంతానికి చెందిన జిల్లా వినోద్ తన భార్య పిల్లలతో కలిసి కుటుంబ సమేతంగా జోరు వానలో తన కారులో ఎల్బీనగర్ వైపు వెళ్తున్నారు. వనస్థలిపురం పనామా చౌరస్తా దగ్గరకు రాగానే వరద ఉధృతికి కారు అదుపు తప్పింది. జాతీయ రహదారి పక్కన వర్షపు నీటితో నిండిన నాలాలోకి దూసుకెళ్లింది. అక్కడే విధుల్లో ఉన్న వనస్థలిపురం ట్రాఫిక్ కానిస్టేబుళ్లు సైదులు, శ్రీనివాసరావు, సిఐ వెంకటేశ్వర్లు అది గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. సమయ స్ఫూర్తితో వ్యవహరించి, ఆపద్బంధువుల్లాగా కారులో ఉన్న ముగ్గురు చిన్నారులతో సహా కుటుంబం మొత్తాన్ని సురక్షితంగా కాపాడారు. వరద ఉద్ధృతి తగ్గిన అనంతరం ప్రత్యేక క్రేన్ సాయంతో కారును నాలా నుంచి బయటకు తీశారు పోలీసులు. కారులో ఉన్నవారిని కాపాడిన ట్రాఫిక్ సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. ట్రాఫక్ అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..