బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. విప్లవాత్మక నిర్ణయం: టీపీసీసీ మహేష్ గౌడ్
తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు 42 శాతం బీసీ రిజర్వేషన్లను ప్రకటించడం చారిత్రకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇది సామాజిక న్యాయం కోసం ఒక పెద్ద అడుగు అని, రాహుల్ గాంధీ చేసిన డిమాండ్కు అనుగుణంగా అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన “సామాజిక విప్లవానికి నాంది”గా అభివర్ణించారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చేసిన “జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి” అన్న డిమాండ్ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పర్చేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే మంత్రివర్గ వర్గ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, సామజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




