Telangana: కంత్రీగాడి నైస్ చాటింగ్కు ఐస్ అయ్యింది.. బాన్సువాడలో బస్సెక్కి.. యూపీలో శవమైంది..
ఆమెకు పెళ్లైంది.. భర్త ..ఇద్దరు పిల్లలు. చిన్న కుటుంబం. ఏ చింతా లేదు. కానీ నిశ్చింతగా మొదలెట్టిన కాలక్షేపం.. పచ్చని కుటుంబంలో చిచ్చు రేపింది.
ఆమెకు పెళ్లైంది.. భర్త ..ఇద్దరు పిల్లలు. చిన్న కుటుంబం. ఏ చింతా లేదు. కానీ నిశ్చింతగా మొదలెట్టిన కాలక్షేపం.. పచ్చని కుటుంబంలో చిచ్చు రేపింది. టైమ్ పాస్గా మొదలైన ఫేస్బుక్ పరిచయం ఆమె జీవితాన్నే మార్చేసింది. నైస్ చాటింగ్ చేశాడని.. ఐసయితే చివరకు అనర్ధం జరిగింది. కామారెడ్డికి చెందిన వివాహిత యూపీలో దారుణ హత్యకు గురైంది. ఇప్పుడంతా స్మార్ట్ఫోన్ యుగం.. పల్లెబాటలో కూడా టెక్నాలజీ పరుగులు తీస్తోంది. చాటింగ్.. డేటింగ్ కల్చర్ హద్దులు దాటి క్రైమ్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. ఫేస్బుక్లో పరిచయమైన ఓ వ్యక్తిని నమ్మిన కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వివాహిత యూపీలో దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.
ఈ ఘనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడలోని గౌలిగూడకు చెందిన ఉస్మాన్ బేగంకు పెళ్లయింది. భర్త ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ కలహాలతో ఆమె పుట్టింటికి చేరింది. పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. రాజీ కుదిర్చారు. మళ్లీ ఆమె కాపురానికి వెళ్లింది. కానీ అంతలోనే కత మరో టర్న్ తీసుకుంది. ఉస్మాన్ బేగం తరుచూ వాట్సాఫ్, ఫేస్బుక్లో బిజీగా ఉండేది. ఫేస్బుక్లో యూపీకి చెందిన షెహజాద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఏం మాయ చేశాడో ఏమో కానీ మొత్తానికి ఆమెను ట్రాప్ చేశాడతను. అత్తారింటికి వచ్చిన ఉస్మాన్.. ఉన్నఫళంగా ప్రియుడి కోసం యూపీ బస్సెక్కింది. కబుర్లు.. షికార్లు నడిచాయి.. సహజీవనం పట్టాలెక్కింది. వారం అయిందో లేదో ఉస్మాన్ కలలు కల్లలయ్యాయి. నిఖా చేసుకోమని పట్టుపట్టడంతో అచ్చం ఢిల్లీ అఫ్తాబ్లాగా అరాచకానికి తెగించాడు షెహజాద్. ఉస్మాన్ బేగంను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
మరోవైపు.. ఉస్మాన్బేగం కన్పించడంలేదని పోలీసులను ఆశ్రయించారు కుటుంబ సభ్యులు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తోన్న క్రమంలోనే ఈ దారుణం వెలుగుచూసింది. యూపీవాలా ఉస్మాన్ను హత్య చేశాడని తెలిసి షాకయ్యారు బంధుమిత్రులు. యూపీ పోలీసుల నుంచి సమాచారం రావడంతో ఉస్మాన్ బేగం హత్యోదంతం వెలుగుచూసింది. నిందితుడు పోలీసులకు సరెండరయ్యాడు. నేరాన్ని ఒప్పుకున్నాడు.
ఫేస్ బుక్ ప్రేమలో పడి.. తెలియని వ్యక్తిని గుడ్డిగా నమ్మి ప్రాణాలను కోల్పోయింది.. ఉస్మాన్ బేగం. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నైస్గా మాట్లాడారని నమ్మితే.. ప్రాణాలకే ప్రమాదం. వాట్సాప్ చాటింగ్.. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ల విషయంలో అప్రమత్తంగా లేకపోతే చివరకు జరిగేది, మిగిలేది ఇలాంటి అనర్ధాలే. తస్మాత్ జాగ్రత్త.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..