AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Weather: చాన్నాళ్లకు చల్లని కబురు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్

తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తక్కువ వర్షపాతం కారణంగా ఖరీఫ్ సాగు మందకొడిగా సాగుతోంది. వరి, పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

TG Weather: చాన్నాళ్లకు చల్లని కబురు.. తెలంగాణలోని ఈ జిల్లాలకు రెయిన్ అలెర్ట్
Rain Alert
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2025 | 7:20 AM

Share

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

తెలంగాణలో వర్షాకాలం సాగు మొదలైనప్పటికీ.. వర్షపాతం మాత్రం అనుకున్నంతగా లేకపోవడంతో రైతులు నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలతో సంతోషించిన రైతులు విత్తనాలు చల్లగా, మొలకెత్తిన అనంతరం వానలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో పత్తి పంట మాత్రం వరుస వానలతో కాస్త ఊపందుకున్నప్పటికీ.. వరి నాటు దశలో వర్షాభావం మరోసారి సమస్యగా మారింది. నెలరోజుల కిందటే వరి నార్లు వేసిన రైతులు ఇప్పటికీ దున్నకాల పనులను మొదలుపెట్టలేకపోతున్నారు. కంది, పెసర, జీలుగ వంటి ఇతర పంటల సాగు కూడా గణనీయంగా తగ్గిపోయింది.

గత రెండేళ్లుగా తగిన వర్షపాతం లేకపోవడంతో భూగర్భజలాలు అడుగంటాయి. వరి సాగు విస్తీర్ణం పెరగడం, నీటి వినియోగం అధికమవడంతో బోర్లు, బావులు ఎండిపోయాయి. మే నెలాఖరులో కురిసిన వానలు రైతుల్లో ఆశ నింపినా.. జూన్‌లో వర్షాలు మందకొడిగా ఉండటంతో పంటల సాగు కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవకపోతే ఈ ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలోని పంటల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..