కొన్ని రోజులే ఉంది.. లాస్ట్ డేట్ దాటితే రేషన్ కార్డు రద్దు! eKYC ఎక్కడ, ఎలా చేయించాలంటే?
తెలంగాణలో రేషన్ కార్డు ఇ-కేవైసీ పూర్తి చేయకుండా గడువు దాటితే రాయితీ రేషన్, ఆహార భద్రతా కార్డు సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు బయోమెట్రిక్ లేదా ఐరిస్ ధృవీకరణను రేషన్ దుకాణం లేదా మీసేవా కేంద్రంలో ఉచితంగా పూర్తి చేయాలి.

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక సూచన చేసింది. రేషన్ కార్డుకు సంబంధించిన e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ గడువులోగా ఇ-కేవైసీ పూర్తి చేయని కుటుంబాలకు రాయితీ రేషన్తో పాటు ఆహార భద్రతా కార్డు (FSC) ద్వారా అందే పలు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు నిలిచిపోయే అవకాశం ఉందని సమాచారం.
పౌర సరఫరాల శాఖ సూచనల ప్రకారం.. రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ (వేలిముద్ర) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ప్రామాణీకరణ పూర్తి చేయాలి. కుటుంబంలో ఒక్కరి ఇ-కేవైసీ మాత్రమే పూర్తి చేయడం సరిపోదని, కార్డులో పేరున్న ప్రతి సభ్యుడి వివరాలను ధృవీకరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలనుకునే వారు తమ స్థానిక ఫెయిర్ ప్రైస్ షాప్ (రేషన్ దుకాణం) లేదా సమీపంలోని మీసేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. అక్కడ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లేదా ఐరిస్ ధృవీకరణ ద్వారా ఇ-కేవైసీ పూర్తవుతుంది. ఇందుకోసం ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు, రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడి ఒరిజినల్ ఆధార్ కార్డు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ఈ e-KYC ప్రక్రియను పూర్తి చేయడానికి ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితంగానే చేస్తారని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఇ-కేవైసీ పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన అర్హులకే చేరేలా చూడడం, నకిలీ లేదా క్రియాశీలంగా లేని రేషన్ కార్డులను గుర్తించడం, లబ్ధిదారుల వివరాలను నవీకరించడం కోసం ఈ ఇ-కేవైసీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందువల్ల గడువు తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా ఇ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు రేషన్ కార్డుదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జూలై 31 తర్వాత ఇ-కేవైసీ పూర్తి చేయని కుటుంబాలకు రేషన్ పంపిణీ, ఇతర ఆహార భద్రతా సేవల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున, రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ధృవీకరణ పూర్తి చేసుకోవడం అవసరమని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
