BRS: ఎమ్మెల్యేల కామెంట్ల కాక.. అదంతా ఉత్తుత్తిదే అంటున్న మంత్రి మల్లారెడ్డి..

టీకాంగ్ కప్పులో తుఫాను.. ఇది కేవలం కాంగ్రెస్ కి మాత్రమే సొంతం. అని అనుకునేలోపు.. బీఆర్ఎస్ కారులోనూ అసంతృప్తి జ్వాలలు. ఇటీవల ఐటీ దాడులను ఎదుర్కున్న మల్లారెడ్డి కేంద్రంగా..

BRS: ఎమ్మెల్యేల కామెంట్ల కాక.. అదంతా ఉత్తుత్తిదే అంటున్న మంత్రి మల్లారెడ్డి..
Mallareddy
Follow us

|

Updated on: Dec 21, 2022 | 5:23 AM

టీకాంగ్ కప్పులో తుఫాను.. ఇది కేవలం కాంగ్రెస్ కి మాత్రమే సొంతం. అని అనుకునేలోపు.. బీఆర్ఎస్ కారులోనూ అసంతృప్తి జ్వాలలు. ఇటీవల ఐటీ దాడులను ఎదుర్కున్న మల్లారెడ్డి కేంద్రంగా.. అంతర్గత కుమ్ములాటలు. ఇంతకీ ఈ వ్యవహారంలో మల్లన్న నెగ్గేనా తగ్గేనా? ఆయన చుట్టు జరుగుతోన్న ఈ అంతర్గత కుమ్ములాటల పంచాయితీలో అసలేం జరిగింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మల్లారెడ్డిపై చేసిన కామెంట్లు.. కాక రేపుతున్నాయి. దీంతో మల్లారెడ్డి సెంట్రిగ్గా మరో వివాదాల చిచ్చు రాజుకుంది. ఇవేం పెద్ద విషయాలు కావని.. మీడియా పెద్దవిగా చేసి చూపుతుందని అన్నారు మంత్రి మల్లారెడ్డి. తమది క్రమశిక్షణ గల పార్టీ అని.. ఇది కేవలం తమ ఇంటి సమస్య అనీ.. తమలో తాము చర్చించుకుని పరిష్కరించుకుంటామని అన్నారు మంత్రి.

‘పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తప్ప నేను కాదు. నేను గాంధేయ వాదిని.. ఎవరితోనూ పెద్దగా గొడవ పెట్టుకునే రకాన్ని కాదు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు నేరుగా నేనే వెళ్లి మాట్లాడతాను. మా మధ్య అంత పెద్ద సమస్యేం లేదు. అవసరమైతే వారందరినీ మా ఇంటికి పిలుస్తా. కావాలనే కొందరు దీన్ని పెద్దది చేసి చూపుతున్నారు’ అని అన్నారు మల్లారెడ్డి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. నామినేటెడ్ పదవుల భర్తీలో మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ.. మొన్న సోమవారం ఐదుగురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, కేపీ వివేకానంద్, భేతి సుభాష్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ మంత్రిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దూలపల్లిలోని ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో సమావేశమయ్యారు. పదవులను తమ సొంత నియోజకవర్గ నాయకులకే కట్టబెడుతున్నారనీ. పార్టీ కోసం కష్టపడ్డవారికి సముచిత స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరే తేల్చుకోవాలని నిర్ణయించారు.

ఇదే విషయంపై మంత్రి మల్లా రెడ్డి స్పందించారు. ఇదేదీ తన చేతిలో ఉన్న విషయం కాదనీ. ఈ సమస్య పరిష్కరించడానికి తన దగ్గర ఏదీ లేదనీ.. నానుంచి ఏం కావాలన్నా ఖచ్చితంగా సహకరిస్తాననీ అంటున్నారు మల్లారెడ్డి. మరి చూడాలి ఈ గొడవ ఎటు తిరుగుతుందో? అని చర్చించుకుంటున్నారు గులాబీ కార్యకర్తలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..