Free Health Checkup: హైదరాబాద్లోని పేదలకు శుభవార్త.. ఇకపై వైద్య పరీక్షలన్నీ ఉచితమే.. డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్రారంభించిన మంత్రి..
Free Health Checkup: నగరంలోని పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Free Health Checkup: నగరంలోని పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో బాగంగా శుక్రవారం నాడు నగర వ్యాప్తంగా పలు చోట్ల బస్తీ దవాఖానాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాలను మంత్రులు ప్రారంభించారు. లాలాపేట్లో డయాగ్నోస్టిక్ హెల్త్ హబ్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. పేదలు వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదన్నారు. ఆ కారణంగానే వారికి అందుబాటులో ఉండేలా ఉచిత వైద్య పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రాల్లో రోగులకు అవసరమైన అన్ని పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారని మంత్రి ఈటల తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్తీ దవాఖానలకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని అనుసంధానం చేశామని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. ఆయా కేంద్రాల్లో ఈసీజీ, ఆల్ట్రా సౌండ్, ఎక్స్రే, రక్త పరీక్షలు ఉచితంగా చేసేందుకు నగర వ్యాప్తంగా ఎనిమిది కేంద్రాలను ఇవాళ ప్రారంభించామని ఆయన తెలిపారు. వీటి పని విధానం పరిశీలించాక.. మరో ఎనిమిది డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ప్రారంభిస్తామిన మంత్రి ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఆరోగ్యశాఖని అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు.
ఇదిలాఉండగా, అంబర్పేటలోని అర్బన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రభుత్వ డయాగ్నోస్టిక్ మినీ హబ్స్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంక్షిస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ డయాగ్నోస్టిక్ హబ్ ద్వారా పేద ప్రజలకు ఎక్స్ రే, ఆల్ట్రా సౌండ్, ఈసీజీ తో పాటు 57 రకాల రక్త, మూత్ర పరీక్షలు ఉచితంగా చేయబడతాయని మంత్రి తలసాని పేర్కొన్నారు.
Also read:
PM Narendra Modi: మనలో ఆత్మవిశ్వాసానికి కొదవ లేదు… టీమిండియా విజయమే స్ఫూర్తి… ప్రధాని మోడీ
ఏపీ గవర్నర్తో ముగిసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ భేటీ.. రేపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్