Telangana: రెండో వాహనం కొంటున్నారా..? ఈ గుడ్ న్యూస్ తెలుసుకోండి…
తెలంగాణలో వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2శాతం అదనపు ట్యాక్స్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసేవారు 2శాతం అదనపు లైఫ్ట్యాక్స్ చెల్లిస్తుండగా.. ఇకపై ఊరట దక్కనుంది.

రాష్ట్రంలో రెండో వాహనం కొనుగోలు చేసే వారికి విధిస్తున్న 2 శాతం అదనపు లైఫ్ ట్యాక్స్ను ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. రవాణాశాఖ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇప్పటివరకు ఒకరి పేరుపై ఇప్పటికే వాహనం ఉంటే.. రెండో వాహనం కొనుగోలు సమయంలో అదనపు పన్ను చెల్లించాల్సి వచ్చేది. సాధారణంగా రూ.1.20 లక్షల విలువైన బైక్ కొనుగోలు చేస్తే సుమారు రూ.2,400 వరకు అదనపు ట్యాక్స్ పడుతోంది. ఈ విధానం కారణంగా ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది.
రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 7 లక్షల బైకులు, 2.5 లక్షలకుపైగా కార్లు కొనుగోలు అవుతున్నాయి. వీటిలో మేజర్ భాగం.. రెండో వాహనాలే. ఈ అదనపు పన్ను ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. పన్ను తప్పించుకునేందుకు చాలామంది కుటుంబ సభ్యుల పేర్లపై వాహనాలు నమోదు చేయడం సాధారణమైంది. తరువాత బీమా క్లెయిమ్ల సమయంలో యాజమాన్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే అంశాన్ని రవాణాశాఖ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.
అలాగే జాతీయ డిజిటల్ ప్లాట్ఫామ్ “వాహన్”లో రెండో వాహనం గుర్తించే ప్రత్యేక ఆప్షన్ లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించాల్సి ఉండటంతో ఖర్చులు పెరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పన్ను లేకపోవడం, ప్రజలపై భారం తగ్గించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పన్నును పూర్తిగా తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసే వారికి నేరుగా ఖర్చు తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సులభం కానుంది.
Also Read: గిన్ని కోళ్లను ఇళ్లలో పెంచుకోవడం వల్ల ఎన్నో లాభాలు..
