Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్..! ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలంటే ఈ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే..!
తెలంగాణలో పాతబడిన వాహనాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కాలుష్యం పెరగడం, రోడ్లపై ప్రమాదాలు ఎక్కువవడం వంటి సమస్యలకు పాత వాహనాలు ఒక కారణంగా మారుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసే విధానాన్ని పూర్తిగా మార్చాలని నిర్ణయించింది.

తెలంగాణలో పాతబడిన వాహనాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. కాలుష్యం పెరగడం, రోడ్లపై ప్రమాదాలు ఎక్కువవడం వంటి సమస్యలకు పాత వాహనాలు ఒక కారణంగా మారుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేసే విధానాన్ని పూర్తిగా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు మాన్యువల్గా జరిగే తనిఖీలకు బదులుగా పూర్తిగా సాంకేతిక ఆధారిత వ్యవస్థను తీసుకురావాలని తెలంగాణ రవాణాశాఖ ముందుకు వచ్చింది.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం అయ్యాయి. మొత్తం 37 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక స్టేషన్ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో అదనంగా మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు మోటారు వాహనాల ఇన్స్పెక్టర్లు చేసే తనిఖీలపై అనేక విమర్శలు ఉన్నాయి. కొన్నిసార్లు పూర్తిస్థాయి పరీక్షలు లేకుండానే ఫిట్నెస్ పత్రాలు జారీ అయ్యేవని ఆరోపణలు వచ్చాయి. దీంతో రోడ్లపై సరిగా పనిచేయని వాహనాలు తిరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ సమస్యను పూర్తిగా నివారించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కొత్త విధానంలో వాహనదారులు ముందుగా ఆన్లైన్లో ఫీజు చెల్లించి సమయాన్ని బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత వాహనాన్ని టెస్టింగ్ స్టేషన్కు తీసుకెళ్లాలి. అక్కడ అత్యాధునిక పరికరాలతో వాహనాన్ని పరీక్షిస్తారు. అన్ని పరీక్షల్లో వాహనం సరైన ప్రమాణాలు కలిగి ఉందని తేలితే కంప్యూటర్ వ్యవస్థే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. మొత్తం ప్రక్రియ చాలా తక్కువ సమయంలో పూర్తయ్యేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.
ఈ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ నిధులను మంజూరు చేసింది. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.296 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ విధానం అమల్లోకి వస్తే వాహనాల తనిఖీల్లో పారదర్శకత పెరగడంతో పాటు రోడ్లపై తిరిగే వాహనాల స్థితి కూడా మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కాలుష్యాన్ని నియంత్రించడం, ప్రమాదాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో ఈ కొత్త వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
