Balaraju Goud |
Updated on: Jul 01, 2021 | 10:02 PM
తెలంగాణలో పల్లెల ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు మంత్రులు. ఈ నెల 5 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. త్వరలోనే స్వంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేస్తామని చెప్పారు మంత్రి హరీష్ రావు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రతి ఒక్కరు గర్విస్తున్నారన్నారు.
పల్లెల అభివృద్ది.. ప్రగతి, పచ్చదనం ధ్యేయంగా సాగుతున్న పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమం తెలంగాణలో మొదటి రోజు ఆర్భాటంగా మొదలయింది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజపేటలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రి.. కేటీఆర్.. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలను ఏడేళ్లలోనే చేసి చూపించామన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు 10 రెట్లు పెంచామని పేర్కొన్నారు. 57 ఏండ్లు నిండిన వారికి త్వరలోనే పెన్షన్లు ఇస్తామన్నారు.
హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్పేట్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే మానేరు నిండిందన్న మంత్రి కేటీఆర్.. చెరువుల నిండా నీళ్లు ఉండటంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్ మొక్కను నాటారు.
అటు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ముద్దాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో మంత్రి హరీష్ రావు వరి విత్తనాలు చల్లారు. ఆ తర్వాత గ్రామంలోజరిగిన గ్రామ ప్రగతి, హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయంలో సాగు విధానాలను మార్చామన్నారు మంత్రి. త్వరలోనే స్వంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణికి అనుమతిస్తామన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజిపూర్ గ్రామంలో జరిగిన పల్లె ప్రకగతి కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు. పల్లెప్రగతి కార్యక్రమాంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని కష్టపడి పని చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు.