Telangana: త్రిశూల వ్యూహంతో దూసుకెళ్తున్న సీఎం రేవంత్‌.. టార్గెట్ కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీగా..

ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీ సహకారంతోనే సాధ్యం అని నమ్ముతున్నారు రేవంత్‌రెడ్డి. ఇదే విషయం ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేస్తున్నారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ వస్తుందని బీజేపీ, ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదంటూ బీఆర్ఎస్‌ కామెంట్స్ చేస్తుండడంతో.. ఈ కామెంట్లనే అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి...

Telangana: త్రిశూల వ్యూహంతో దూసుకెళ్తున్న సీఎం రేవంత్‌.. టార్గెట్ కేసీఆర్‌ అండ్‌ ఫ్యామిలీగా..
Revanth Reddy
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 13, 2024 | 8:03 AM

రేవంత్‌రెడ్డి అనుకోకుండా ముఖ్యమంత్రి అవలేదు. ప్రతిపక్షంలో బాగా నలిగిన తరువాతనే ఈస్థాయికి వచ్చారు. ప్రతిపక్షాలపై ఎప్పుడు, ఎలా విరుచుకుపడాలో బాగా తెలుసు. అందుకే, బీఆర్ఎస్‌పై ఓ సెపరేట్‌ స్ట్రాటజీతో వెళ్తున్నారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి దూకుడును కొలవడానికి ఏ పరికరాలు సరిపోవడం లేదు. అంతగా ఎదురుదాడికి దిగుతున్నారు. తనను ఏ విషయంలో టార్గెట్‌ చేస్తారో తెలిసే.. ముందుగా రియాక్ట్ అవుతున్నారు. అందులోనూ.. ఒకప్పుడు కేసీఆర్ వాడిన భాషలోనే సమాధానం చెబుతున్నారు. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనన్న నినాదం అసెంబ్లీ ఎన్నికల ముందు బాగా వర్కౌట్‌ అయింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రానివ్వబోనన్న సీఎం రేవంత్‌రెడ్డి.. మళ్లీ అదే నినాదాన్ని ఎత్తుకున్నారు. కాకపోతే, ఈసారి మరింత సీరియస్‌గా. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారంటూ పదేపదే ప్రస్తావించడం వెనక కారణం అదే.

ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే బీజేపీ సహకారంతోనే సాధ్యం అని నమ్ముతున్నారు రేవంత్‌రెడ్డి. ఇదే విషయం ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా చేస్తున్నారు. తెలంగాణలో డబుల్‌ ఇంజిన్ సర్కార్‌ వస్తుందని బీజేపీ, ఈ ప్రభుత్వం ఎన్నాళ్లో ఉండదంటూ బీఆర్ఎస్‌ కామెంట్స్ చేస్తుండడంతో.. ఈ కామెంట్లనే అస్త్రాలుగా ప్రయోగిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. నిజానికి ఒకప్పుడు కేసీఆర్ వాడిన అస్త్రమే ఇది. అసలు రేవంత్‌రెడ్డిపై కేసు పెట్టడానికి కారణం అయిందే ఈ అస్త్రం. తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నం జరిగిందని ఓటుకు నోటు కేసును చాలా బలంగా తీసుకెళ్లారు అప్పట్లో కేసీఆర్. అదే సమయంలో.. తన ప్రభుత్వాన్ని కాపాడుకోడానికే బీఆర్ఎస్‌లో చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు ఆనాడు కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు సరిగ్గా అదే అస్త్రాన్ని ఉపయోగించుకుంటున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. తమ ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి అవసరమైతే గేట్లు తెరుస్తానన్నారు.

కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చడానికి బీఆర్ఎస్-బీజేపీ పదేపదే ప్రయత్నిస్తున్నాయని జనంలోకి బలంగా ఎక్కిస్తున్నారు సీఎం రేవంత్‌. ఇది ఒకరకమైన దాడి. ఇక త్రిశూల వ్యూహంలో భాగంగా మరోరకమైన దాడి కూడా చేస్తున్నారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీనే టార్గెట్‌గా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ ఒక్కో అంశాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదట కాళేశ్వరంపై దర్యాప్తు చేయిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ అవినీతి కారణంగానే కాళేశ్వరం పిల్లర్లు కుంగాయంటూ పదేపదే చెబుతున్నారు.

కాళేశ్వరంపై హడావుడి చేస్తూనే లిక్కర్‌ షాపులపై పడ్డారు. తాజాగా టానిక్‌ షాప్ ఉదంతమే ఉదాహరణ. అందులో కేసీఆర్ కుటుంబ సభ్యులకు వాటా ఉందన్న విషయం ప్రొజెక్ట్‌ అయ్యేలా ప్రభుత్వం పావులు కదుపుతోందన్న చర్చ జరుగుతోంది. ఇక ధరణి. ధరణిని ఆధారంగా చేసుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులు భూములు కొల్లగొట్టారని ఆరోపిస్తూ వస్తున్నారు సీఎం రేవంత్. ఇప్పుడు ధరణి సమస్యలపైనా, అందులో జరిగిన భూ లావాదేవీలపైనా లోతుగా విచారణ జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్‌కు ఆర్థికంగా అండగా ఉండేవారిపైనా ఫోకస్‌ పెట్టారు సీఎం రేవంత్. అందులో భాగంగానే మల్లారెడ్డి అల్లుడు కాలేజీ భవనాల కూల్చివేత జరిగిందని చెబుతున్నారు.

జాగ్రత్తగా గమనిస్తే.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను గాని, ఆ పార్టీ నేతలను గానీ పెద్దగా టార్గెట్ చేయడం లేదు సీఎం రేవంత్‌. టార్గెట్ కేవలం కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మాత్రమే. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునే ఉద్దేశం ఉంది కాబోలు వాళ్లను పెద్దగా విమర్శించడం లేదు. కేవలం కేసీఆర్ ఫ్యామిలీని మాత్రమే ఒంటరి చేసే వ్యూహం కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి భారీగా జరిగిందని ప్రొజెక్ట్ చేస్తూ.. కాళేశ్వరం, లిక్కర్ షాపులు, ధరణి ద్వారా ఆ ఫ్యామిలీ దోచుకుందని చెబుతున్నారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రాకూడదంటే.. ఆ పార్టీని ఖాళీ చేయడం ఒక్కటే దారి. త్రిశూలవ్యూహంలో ఇది మూడోరకమైన ఎదురుదాడి. ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడుతున్నాయి కూడా. 15 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. అయితే, బీఆర్ఎస్‌ను ఖాళీ చేసే ముందు.. ప్రజలకు ఓ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు రేవంత్‌రెడ్డి. తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందని చెబుతున్నారు. బీఆర్ఎస్‌కు బీజేపీతో అవగాహన ఉందన్న విషయాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

అందుకే, ఈ రెండు పార్టీలు ఒక అవగాహనతోనే సీట్లు ప్రకటించలేదంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షానికి బలం లేకుండా చేస్తే ఎలా ఉంటుందో కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుకు చూపించదలచుకున్నారు. అందుకే, పార్టీలో మీరు ముగ్గురే మిగులుతారు అంటూ చెప్పుకొచ్చారు. 2014లో టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు కమ్యూనిస్టు ఎమ్మెల్యేలను కూడా చేర్చుకున్నారు కేసీఆర్. ఆ తరువాత 2018లోనూ ఇదే తంతు కొనసాగింది. ఇప్పుడు తన టైమ్‌ వచ్చిందంటున్నారు రేవంత్‌. తెలంగాణ సమాజంలోనూ ఈ చేరికలపై పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు. ఆ లెవెల్‌లో కేసీఆర్ కండువాలు కప్పడమే కారణం. ఇప్పుడు అదే అస్త్రాన్ని ఉపయోగించుకోబోతున్నారు. ఓవరాల్‌గా బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనంటూ రాజకీయంగా దెబ్బతీయడం, అవినీతి ఆరోపణలు చేయడం, కేసీఆర్ ఫ్యామిలీని ఒంటరి చేసి బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడం. ఈ త్రిశూలవ్యూహాన్నే అమలుచేస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..