TS Cabinet Meet: కొనసాగుతోన్న తెలంగాణ మంత్రివర్గ భేటీ.. పోడు భూముల సమస్య పరిష్కారానికి కేబినెట్ సబ్-కమిటీ
Telangana cabinet meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరుగుతుంది.

Telangana cabinet meeting: తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరుగుతుంది. మొదట కొవిడ్ పరిస్థితిపై చర్చించింది మంత్రివర్గం. ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై ఆరా తీసింది..కేబినెట్కు పూర్తి వివరాలు అందించింది రాష్ట్ర, వైద్య, ఆరోగ్య శాఖ. థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలకు కరోనా వస్తే, తీసుకోవల్సిన చర్యలపై కేబినెట్ చర్చించింది. ఎలాంటి పరిస్థితులైనా ఎదర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు తెలిపారు..విద్యాసంస్థల ప్రారంభం తర్వాత.. కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించలేదని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకువచ్చారు. ఇదే క్రమంలో అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.
కరోనా పరిస్థితులపై కేబినెట్ ఆరా.. మరోవైపు, రాష్ట్రంలో థర్డ్ వేవ్ పరిస్థితులు రాకుండా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ చేయాలని మంత్రివర్గం ఆదేశించింది. వచ్చే ఏడాది నుంచి కొత్త మెడికల్ కాలేజీల ప్రారంభించాలని సూచించింది.. అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వైద్యఆరోగ్యశాఖను ఆదేశించింది. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంపైనా సమీక్ష జరిపింది మంత్రివర్గం..
వ్యవసాయం, పౌర సరఫరాల శాఖ సన్నద్ధతపై చర్చ.. వర్షపాత వివరాలు, వానాకాలంలో రాష్ట్రంలో మొత్తం సాగు అయిన భూమి వివరాలు, పంటల దిగుబడి అంచనాలు తదితర వ్యవసాయ అంశాలపై రాష్ట్ర కేబినెట్ చర్చించింది. వానాకాలంలో పంటల కొనుగోలుపై అందుకు మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై కేబినెట్ ఆరా తీసింది. అలాగే, పోడు భూముల సమస్యలపై పూర్తి అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనల కోసం కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కమిటిలో మంత్రులు సత్యవతి రాథోడ్ చైర్మన్ గానూ, మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్లు సభ్యులుగా వ్యవహరిస్తారు.
హోం శాఖ పై సమీక్ష.. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో శాంతి భద్రతల సమస్యపై మంత్రి మండలి ప్రధానంగా చర్చించింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఇతర పోలీస్ స్టేషన్లలోని సమస్యలు అవసరాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీ నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హోం శాఖమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, ఇంద్ర కరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లు సభ్యులుగా సబ్ కమిటీలో కొనసాగనున్నారు.
శాసనసభ సమవేశాల నిర్వహణపై చర్చ.. అలాగే, శాసనసభ సమావేశాల నిర్వహణపై సమావేశం చర్చిస్తోంది. బడ్జెట్ సమావేశాలు మార్చ్ 26న ముగిశాయి. అప్పట్నుంచి ఆర్నెళ్లలోపు.. అంటే ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభలు మళ్లీ సమావేశం కావాల్సి ఉంది. దీంతో సమావేశాల నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వారం, పదిరోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
దళిత బంధు పథకం అమలు.. దళితబంధు పథకంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు మరో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. పంటల సాగు, వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం నిర్ణయం, సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీ అంశంపై భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర మంత్రులతో చర్చించిన విషయాలు, సంబంధిత అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.