Telangana: పేదలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్న్యూస్.. ఇకపై ప్రైవేట్ వెంచర్లలోనూ..
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ పేరుతో కొత్త విధానాన్ని రూపొందిస్తున్న ప్రభుత్వం.. ప్రైవేట్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో పేదలకు ప్రత్యేక వాటా కేటాయింపును తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ప్రభుత్వం తీసుకురానున్న ఈ విధానం అమల్లోకి వస్తే పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల మరింత చేరువ కానుంది.

కొత్త పాలసీ ప్రకారం ఇకపై రాష్ట్రంలో నిర్మించే ప్రతి ప్రైవేట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 20 శాతం స్థలం లేదా ఇళ్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రీన్ ఏరియా, ఓపెన్ స్పేస్ కోసం 20 శాతం కేటాయింపు ఉండగా.. దీనికి అదనంగా మరో 20 శాతం పేదల కోసం ఇవ్వాల్సి రావొచ్చు.ఈ విధానాన్ని అమలు చేసేందుకు తెలంగాణ హౌసింగ్ అధికారులు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నమూనాలను అధ్యయనం చేశారు. అక్కడ ఇప్పటికే ప్రైవేట్ ప్రాజెక్టుల్లో పేదలకు ఇండ్ల కేటాయింపు విజయవంతంగా అమలవుతోంది. అదే తరహాలో తెలంగాణలో కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
రాంకీ ప్రాజెక్ట్ మోడల్గా మారనుందా?
గచ్చిబౌలిలో గతంలో నిర్మించిన రాంకీ ప్రాజెక్ట్ను అధికారులు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో అప్పటి జీవో ప్రకారం 20 శాతం స్థలం పేదల కోసం కేటాయించి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించారు. ఇప్పుడు అదే మోడల్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే దిశగా చర్చలు జరుగుతున్నాయి. హౌసింగ్ శాఖ ఇప్పటికే డ్రాఫ్ట్ పాలసీ సిద్ధం చేసింది. త్వరలో బిల్డర్లతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకోనుంది. అనంతరం తుది రూపంలో పాలసీని ప్రభుత్వం ప్రకటించే అవకాశముంది.
కార్మికులకు దగ్గర్లోనే నివాసం లక్ష్యం
ఇటీవల ప్రభుత్వం రూ.15 లక్షల లోపు ధరతో 600 ఎస్ఎఫ్టీ పరిధిలో ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకురాగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో అఫర్డబుల్ హౌసింగ్పై ప్రభుత్వం మరింత ఫోకస్ పెంచింది.పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాల్లో పని చేసే కార్మికులు దూర ప్రాంతాల నుంచి రావాల్సిన అవసరం లేకుండా అదే ప్రాజెక్టు పరిధిలో నివసించేలా చేయడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.
త్వరలో అధికారిక ప్రకటన
ఉమ్మడి రాష్ట్రంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. బిల్డర్ 20 శాతం స్థలం ఇవ్వలేకపోతే నిర్ణీత రుసుము ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు కూడా మరింత కఠినమైన, చట్టబద్ధమైన నిబంధనలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. డ్రాఫ్ట్ పాలసీపై చర్చలు పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ‘అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ’ని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల మరింత చేరువ కానుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
