ఏడాదిన్నరలో 5 సార్లు బదిలీ.. తహసీల్దార్కు గుండెపోటు! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
తెలంగాణ రాష్ట్రంలో నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీల జాబితా వెలువడింది. ఇందులో బాన్సువాడ ఆర్టీవో కార్యాలయంలో తహసీల్దార్గా పనిచేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పేరు కూడా ఉంది. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే నాలుగు సార్లు ట్రాన్స్ఫర్ అవగా.. తాజాగా ఐదోసారి బదిలీ అర్డర్ చేతికందింది. అప్పటికే విసిగెత్తిపోయిన ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు..

బాన్సువాడ, మార్చి 24: ఆయనో నిజాయితీ పరుడైన ప్రభుత్వ అధికారి. భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగి. దంపతులిద్దరూ ఒకేచోట పనిచేసే అవకాశం ఉన్నా ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల ఏడాదిన్నర కాలంలో వరుసగా ఐదు సార్లు బదిలీ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ ప్రభుత్వాధికారికి జరిగిన అన్యాయం ఇది. తోటి ఉద్యోగులు తెలిపిన ప్రకారం..
నాలుగు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీల జాబితా వెలువడింది. ఇందులో బాన్సువాడ ఆర్టీవో కార్యాలయంలో తహసీల్దార్గా పనిచేస్తున్న విజయ్కుమార్ (59)ని ఎల్లారెడ్డి ఆర్డీవో ఆఫీస్కు బదిలీ చేశారు. సర్కార్ ఉత్తర్వుల మేరకు ఆయన ఈ నెల 24న విధుల్లో చేరాల్సి ఉంది. అయితే మార్చి 22న అర్ధరాత్రి విజయ్ కుమార్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన ఆదే రోజు మృతి చెందారు. విజయ్కుమార్ స్వగ్రామం ఆర్మూర్. ఆయన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. వీరి దంపతులకు ఇద్దరు కూతుళ్లు.
భార్యాభర్తలు ఒకే దగ్గర పనిచేసేందుకు అవకాశమున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఏడాదిన్నరలో ఐదుసార్లు బదిలీ చేశారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా నిర్మల్ జిల్లాకు బదిలీ చేశారు. ఆ తర్వాత మళ్లీ నిబంధనలకు విరుద్ధంగా ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు. స్పౌస్ కోటాలో నిజామాబాద్కు బదిలీకి ప్రయత్నం చేయగా అతడి విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోకుండా కామారెడ్డికి బదిలీ చేశారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా కామారెడ్డి జిల్లాలో మరో మూడు సార్లు బదిలీ చేశారు. ఇలా తరచూ బదిలీలతో విసిగెత్తి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన విజయ్ కుమార్కు తాజాగా గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం అర్ధరాత్రి మృతి చెందారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.