Telangana: రోజూ అలా చేస్తున్నాడని.. తండ్రిని దారుణంగా చంపిన కొడుకులు.. కత్తులతో దాడి చేసి..
కుటుంబ బాధ్యతను తీసుకోవాల్సిన తండ్రి.. వ్యసనాలకు బానిసై, భార్య పిల్లల్ని వేధించడమే అలవాటుగా మార్చుకున్నాడు. చివరికి వాళ్ల చేతుల్లోనే బలైపోయాడు.
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని వేధిస్తున్న తండ్రిని తనయులు హత్యచేసిన ఘటన ఆదివారం తూర్పుగూడెం గ్రామంలో వెలుగులోకివచ్చింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగూడెం గ్రామానికి చెందిన తిప్పపర్తి భాస్కర్.. మద్యానికి బానిసయ్యాడు. రోజూ తాగడం, భార్య కరుణారాణిని కొట్టడం, కొడుకులపై దాడిచేయడమే అతని దినచర్య. అతనికి లేని చెడు అలవాట్లు అంటూ ఏవీ లేవు. పైపెచ్చు.. భార్యను వేధించడం మొదలు పెట్టాడు. అవన్నీ భరిస్తూ.. ఆమె రోజులు గడుపుతూ వస్తోంది. వాళ్ల ఇద్దరు కొడుకులు తరుణ్.. హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక్కడ డ్రైవర్లుగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు.
అయితే, ఇంటి దగ్గర మాత్రం ఆ తల్లికి చిత్రహింసలు మాత్రం తప్పడం లేదు. భాస్కర్ భార్యపై పదునైన ఆయుధాలతో సైతం దాడిచేసేవాడు. తండ్రి చేష్టలు తెలుసుకుని.. కొడుకులు పలుమార్లు హెచ్చరించినా.. ఆయన తీరు ఏమాత్రం మారలేదంటున్నారు కుటుంబసభ్యులు. ఇటీవల పండుగ సందర్భంగా ఇద్దరు కుమారులు తరుణ్, బాలతేజ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలోనూ భాస్కర్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. కొడుకుల ముందే తల్లిని కొట్టేవాడు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ దూషించేవాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో భాస్కర్ గొడవ పెట్టుకున్నాడు. ఆదివారం కూడా మరోసారి ఇంట్లో గొడవ జరగడంతో.. భాస్కర్ .. భార్య, కుమారులపై దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం కుమారులు ఇంట్లో ఉన్న కత్తులతో తండ్రిపై దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపై ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత ఇద్దరు కొడుకులు పారిపోయారు.
ఈ ఘటనతో తూర్పుగూడెం గ్రామం ఒక్కసారిగా ఉలిక్కపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటామని ఎస్సై అలీ చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..