AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేదో రాయి లేదా మట్టిముద్ద అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే స్టన్ అవుతారు..

పురాతన నాగరికత, చారిత్రక విశేషాలు, ప్రాచీన కట్టడాలు, పురాతన ఆలయాలు, చారిత్రక శిల్ప సంపదకు నిలయం ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఓ వ్యవసాయ క్షేత్రంలో దొరికిన వస్తువు ఒక చిన్న మట్టి ముద్దలా కనిపిస్తుంది..! చేతిలోకి తీసుకుంటే సాధారణ రాయిలానే అనిపిస్తుంది..! కానీ దాని వెనుక ఉన్న చరిత్ర మాత్రం వందలు కాదు.. వేల ఏళ్ల నాటిది. నల్లగొండ నేల మరోసారి తనలో దాగిన చరిత్రను బయటకు తీసింది. శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్న అరుదైన టెర్రకోట డాబర్‌ వెలుగులోకి రావడం ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ డాబర్‌ ఎక్కడ దొరికింది..? దీని ప్రత్యేకత ఏంటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ఇదేదో రాయి లేదా మట్టిముద్ద అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే స్టన్ అవుతారు..
Archaeological Evidence
M Revan Reddy
| Edited By: |

Updated on: Sep 16, 2026 | 9:22 AM

Share

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అలనాటి చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, శాసనాలు కూడా ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో ఓ రైతు వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో మట్టి పెంకులు బయటపడ్డాయి. అయితే వాటిని సాధారణ మట్టి పెంకులుగా భావించి పక్కన పడేశారు. అయితే చూడటానికి మట్టి ముద్దలా కనిపించినా.. ఈ అరుదైన టెర్రకోట వస్తువుగా చరిత్రకారులు గుర్తించారు. ఈ మట్టి పెంకులను పరిశీలించిన చరిత్రకారులు ఇది సాధారణ వస్తువు కాదని గుర్తించారు.

కుండలు.. మట్టి వస్తువులు.. ఆనాటి జీవితం.. తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు చిక్కుల యాదగిరి, మేక అశోక్ రెడ్డిలు అప్పాజీపేటను సందర్శించి ఈ మట్టి ముద్దలను పరిశీలించారు. శాతవాహనుల కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ డాబర్‌, అప్పటి ప్రజల జీవన విధానం, కుండల తయారీ వంటి సంప్రదాయాలకు సంబంధించిన కీలక ఆధారంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అప్పట్లో కుండలు చేసే సమయంలో టెర్రకోట డాబర్ను లోపలివైపు పెట్టుకుని, పై నుంచి మరో చెక్కబద్దతో కొడుతు కుండకు ఆకారాన్ని ఇచ్చేవారని పేర్కొన్నారు. ఇటువంటివి గతంలో ఉత్తరప్రదేశ్‌లో లభించాయని చరిత్రకారులు చెబుతున్నారు. అవి క్రీ.పూ 200ల నుంచి క్రీ.శ.600 సంవత్సరాల నాటివని పేర్కొన్నారు.

ఇది మట్టి వస్తువు కాదు..నాటి నాగరికతకు సాక్ష్యం..

ఈ టెర్రకోట డాబర్‌పై మరింత శాస్త్రీయ పరిశోధన జరిగితే.. దాని కాలం, వినియోగం, తయారీ విధానం వంటి అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ టెర్రకోట వస్తువు లభించడం ద్వారా నల్లగొండ ప్రాంతంలో అప్పటి సామాజిక, ఆర్థిక జీవనంపై మరింత పరిశోధనకు అవకాశం ఏర్పడింది.

వ్యవసాయ భూముల్లో తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఇలాంటి పురాతన వస్తువులు బయటపడుతుండటంతో.. నల్లగొండ నేలలో ఇంకా ఎన్నో చారిత్రక ఆనవాళ్లు దాగి ఉండొచ్చన్న చరిత్రకారులు భావిస్తున్నారు.

Follow Us