Mohammad Nabi: ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర.. అఫ్ఘానిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ అరుదైన రికార్డు
Mohammad Nabi: భారత్తో రెండో టీ20లో మహమ్మద్ నబీ అరుదైన రికార్డు సాధించాడు. 14 బంతుల్లో 20 పరుగులు చేసి టీ20 అంతర్జాతీయ కెరీర్లో 2,500 పరుగులు పూర్తి చేశాడు. 111 వికెట్లతో కలిపి 2,500+ పరుగులు, 100+ వికెట్లు సాధించిన ఎలైట్ జాబితాలో చేరాడు. షకిబ్, సికందర్ రజా, వీరన్దీప్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.

Mohammad Nabi: అంతర్జాతీయ క్రికెట్లో అఫ్ఘానిస్తాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ నబీ మరో అరుదైన ఘనతను సాధించాడు. భారత్తో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా నబీ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే టీ20 క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిన 41 ఏళ్ల నబీ, తాజాగా ఆల్ రౌండర్గా అరుదైన మైలురాయిని చేరుకుని ఎలైట్ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు.
భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో నబీ 14 బంతుల్లో 20 పరుగులు చేసి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయినా కూడా ఆ ఇన్నింగ్స్లో తన టీ20 అంతర్జాతీయ కెరీర్లో 2,500 పరుగుల మార్కును పూర్తి చేసుకున్నాడు. అఫ్ఘానిస్తాన్ తరఫున ఇప్పటివరకు 153 టీ20 మ్యాచ్లు ఆడిన నబీ, తన బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చాడు. ఈ ఫార్మాట్లో ఆయన ఇప్పటికే 111 వికెట్లను కూడా పడగొట్టాడు.
టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 2,500లకు పైగా పరుగులు సాధించి, 100కు పైగా వికెట్లు తీసిన నలుగురు ఆటగాళ్ల జాబితాలో ఇప్పుడు మహమ్మద్ నబీ కూడా చేరాడు. ఈ రికార్డు సాధించిన అఫ్ఘానిస్తాన్ తొలి క్రికెటర్గా, ప్రపంచంలో నాల్గో ఆటగాడిగా నబీ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ అరుదైన ఘనత బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకిబ్ అల్ హసన్, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా, మలేషియా ఆల్ రౌండర్ వీరన్దీప్ సింగ్ మాత్రమే సాధించారు.
టీ20ల్లో 2500+ పరుగులు, 100+ వికెట్లు తీసిన ఆటగాళ్ల వివరాలు:
షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్): 2,551 పరుగులు, 149 వికెట్లు
సికందర్ రజా (జింబాబ్వే): 3,244 పరుగులు, 114 వికెట్లు
వీరన్దీప్ సింగ్ (మలేషియా): 3,402 పరుగులు, 126 వికెట్లు
మహమ్మద్ నబీ (అఫ్ఘానిస్తాన్): 2,501 పరుగులు, 111 వికెట్లు
ఈ జాబితాలో సికందర్ రజా, వీరన్దీప్ సింగ్లు మాత్రమే 3,000లకు పైగా పరుగులు, 100కి పైగా వికెట్ల రికార్డును కలిగి ఉన్నారు.
ఈ సిరీస్ ప్రారంభమయ్యే నాటికి మహమ్మద్ నబీ వయసు 41 సంవత్సరాల 255 రోజులు కాగా, రెండో మ్యాచ్ నాటికి 41 సంవత్సరాల 257 రోజులకు చేరింది. దీని ద్వారా భారతదేశ గడ్డపై అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన మూడో అత్యంత వయసున్న క్రికెటర్గా నబీ నిలిచాడు. అంతకుముందు హాంకాంగ్కు చెందిన రయాన్ కాంప్బెల్ (44 ఏళ్లు), ఇటలీకి చెందిన వేన్ మాడ్సన్ (42 ఏళ్లు) మాత్రమే ఈ జాబితాలో నబీ కంటే ముందున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
