AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి గొర్రెల పెంపకం.. 5 నెలల్లోనే కళ్లు చెదిరేలా..

పదేళ్ల కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యవసాయాన్ని వ్యాపారంగా మలుచుకున్న తిరుపతి విజయగాథ ఇది. సొంతంగా ఏదైనా చేయాలన్న తపనతో గొర్రె పొట్టేళ్ల పెంపకంలోకి అడుగుపెట్టిన ఆయన, కేవలం ఐదు నెలల్లోనే పొట్టేళ్లను పెంచి లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నారు. పంటతో మేత, మేతతో జీవాలు అన్న సిద్ధాంతంతో స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్నారు.

కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి గొర్రెల పెంపకం.. 5 నెలల్లోనే కళ్లు చెదిరేలా..
Sheep Farming Success
Ram Naramaneni
|

Updated on: Sep 16, 2026 | 8:16 AM

Share

ప్రకాశం జిల్లా, ఉలవపాడు మండలం, కొల్లూరుపాడు గ్రామానికి చెందిన తిరుపతి, పదేళ్ల పాటు పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసిన తర్వాత అందరి అంచనాలకు భిన్నంగా ఆ స్థిరమైన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే తపన, వ్యవసాయ రంగంపై ఉన్న ఆసక్తి ఆయనను పశుపోషణ వైపు నడిపించింది. మొదట మేకల పెంపకంతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన తిరుపతి, అనుభవం పెరిగే కొద్దీ తన వ్యాపార విధానాన్ని మార్చుకుని గొర్రె పొట్టేళ్ల పెంపకంపై దృష్టి సారించారు. తనకున్న రెండు ఎకరాల పొలంలో అత్యాధునిక షెడ్‌ను నిర్మించుకుని గొర్రెల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఈ షెడ్డు నిర్మాణానికి దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చుకోవడానికి ఉలవపాడులోని ఎస్‌బిఐ బ్యాంకు నుంచి పీఎంఈజీపీ (ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రాం) కింద 20 లక్షల రూపాయల రుణం పొందారు. ఇందులో 25% అంటే 5 లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో లభించింది. తిరుపతి పెంపకంలో పశువుల మేత ఒక కీలకమైన అంశం. జీవాలకు మేత కోసం బయటి నుంచి కొనుగోలు చేయకుండా తన పొలంలో ఒక ఎకరంలో సూపర్ నేపియర్ గడ్డిని పెంచుతున్నారు. దీంతో పాటు పక్కనే ఉన్న ఐదు ఎకరాల భూమిని లీజుకు తీసుకుని అందులో సుబాబుల్, సరుగుడు మొక్కలను నాటారు. ఈ మొక్కల మధ్య పెరిగే గడ్డి జీవాలకు మేతగా ఉపయోగపడుతుంది. ఐదు, ఆరు సంవత్సరాల తర్వాత పెరిగిన ఈ చెట్లు కలప రూపంలో మరో ఆదాయ వనరుగా మారతాయని తిరుపతి వివరించారు.

పొట్టేళ్ల పెంపకంలో తిరుపతి ఒక సమర్థవంతమైన పద్ధతిని అనుసరిస్తున్నారు. మంచి నెల్లూరు జుడూపి రకం పొట్టేళ్ల పిల్లలను కొనుగోలు చేసి, వాటిని దాదాపు ఐదు నెలల పాటు పెంచుతారు. ఉదయం మొక్కజొన్న, జొన్నలు, తవుడు మిశ్రమాన్ని దానాగా ఇస్తారు. మధ్యాహ్నం పొట్టేళ్ల పిల్లలకు టీఎంఆర్ (టోటల్ మిక్స్డ్ రేషన్) అందిస్తారు. సాయంత్రం సూపర్ నేపియర్ గడ్డిని మేతగా ఇస్తారు. పశువుల ఆరోగ్యానికి డీవార్మింగ్, క్రమం తప్పకుండా వైద్య సలహాలు తీసుకోవడం ఎంతో అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే స్థానిక పశువైద్యులు, అసిస్టెంట్ డైరెక్టర్‌ను సంప్రదించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం 15 కిలోల బరువు పైబడిన పొట్టేళ్లను విక్రయిస్తున్నారు. వీటిని గుడూరు మార్కెట్‌లోను, స్థానికంగా జరిగే తిరునాళ్లు, పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాలకు విక్రయించడం ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు. మొదట 50 మేకలతో ప్రారంభించి, వాటి సంఖ్యను 250కి పెంచారు. ఈ పెంపకంతో పాటు ప్యూర్ నాటుకోళ్లను కూడా షెడ్డు కింద, పొలాల్లో సహజసిద్ధంగా తిరిగేలా పెంచుతూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఉద్యోగం ఇచ్చే జీతం కోసం మాత్రమే ఎదురుచూడకుండా, తన భూమినే పెట్టుబడిగా మార్చుకొని, పంటతో మేత, మేతతో జీవాలు, జీవాలతో ఆదాయం అనే సూత్రంతో వ్యవసాయాన్ని, పశుపోషణను సమన్వయం చేస్తూ తిరుపతి స్వయం ఉపాధితో ముందుకు సాగుతున్నారు. ఆయన సాహసోపేతమైన నిర్ణయం, సరైన ప్రణాళికతో కూడిన ప్రయత్నం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

Follow Us