పల్లెలోనే కాదు.. నగరాల్లోనూ కొండ చిలువల హల్చల్! హైదరాబాద్ పాతబస్తీలో..
హైదరాబాద్ పాతబస్తీలో ఒకేరోజు రెండు పాము ఘటనలు కలకలం రేపాయి. హసన్నగర్లో కొండచిలువ ప్రత్యక్షమవగా, మరోవైపు రేషన్ బియ్యం సంచిలో చిన్న పాము కనిపించింది. వర్షాకాలంలో పాముల సంచారం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పాము కనిపిస్తే నిపుణులకు మాత్రమే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్లోని పాతబస్తీలో ఒకేరోజు చోటుచేసుకున్న రెండు ఘటనలు స్థానికులను ఆందోళనకు గురి చేశాయి. ఒకవైపు హసన్నగర్లో కొండచిలువ ప్రత్యక్షం కాగా, మరోవైపు రేషన్ దుకాణంలో పంపిణీ చేసిన బియ్యం సంచిలో చిన్న పాము కనిపించడం కలకలం రేపింది. హసన్నగర్లోని ఐస్ ఫ్యాక్టరీ సమీపంలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే నిపుణులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనాస్థలికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
వీడియో చూడండి
ఇదే సమయంలో పాతబస్తీలోని ఓ రేషన్ దుకాణం నుంచి తీసుకెళ్లిన బియ్యం సంచిని ఇంట్లో తెరిచిన ఓ కుటుంబానికి చిన్న పాము కనిపించింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ఈ ఘటనతో కాలనీవాసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మూడు నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేస్తున్నందున వర్షాకాలంలో పాములు ఆహారం, ఆశ్రయం కోసం నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, బియ్యం సంచులు, నిల్వ గదులు, చెత్త కుప్పలు వంటి ప్రదేశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచిస్తున్నారు. పాము కనిపిస్తే స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయకుండా వెంటనే అటవీ శాఖ లేదా పాములు పట్టే నిపుణులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
