Telangana: కాంగ్రెస్ పాంచ్ న్యాయ్ వర్సెస్ బీజేపీ సంకల్ప్పత్ర్.. వీటి చుట్టూ నాయకుల రాజకీయం..
బీజేపీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తుంటే.. విపక్షాలు మాత్రం ఎదురుదాడికి దిగాయి. వికసిత్ భారత్ నినాదం 2004ను రిపీట్ చేయడం ఖాయమని విమర్శిస్తున్నాయి. గత పదేళ్లలో మోదీ పేదలకు చేసిందేమీ లేదన్నారు. అమలు కానీ హామీలపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ అంటే.. బీజేపీ 14 కీలక అంశాలను సంకల్ప్పత్ర్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది.

బీజేపీ మేనిఫెస్టోపై సొంత పార్టీ నేతలు ప్రశంసల జల్లు కురిపిస్తుంటే.. విపక్షాలు మాత్రం ఎదురుదాడికి దిగాయి. వికసిత్ భారత్ నినాదం 2004ను రిపీట్ చేయడం ఖాయమని విమర్శిస్తున్నాయి. గత పదేళ్లలో మోదీ పేదలకు చేసిందేమీ లేదన్నారు. అమలు కానీ హామీలపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు కాంగ్రెస్ నేతలు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ అంటే.. బీజేపీ 14 కీలక అంశాలను సంకల్ప్పత్ర్ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశ కళ్యాణం, దేశ హితం కోసం తాము మేనిఫెస్టో ప్రవేశ పెట్టామన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. పేదలు, మహిళలు, యువత, రైతులకు సంబంధించిన ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. ప్రధానంగా ఈ నాలుగు అంశాలపైనా రాబోయే ఐదేళ్లు పని చేస్తామన్నారు. రాబోయే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం ఇస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ను పొడగించాం.. ఇది అతిపెద్ద నిర్ణయమన్నారు కిషన్రెడ్డి.
గత పదేళ్లలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించామన్నారు. 4 కోట్ల మందికి పైగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 11.8 కోట్ల గృహాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా సురక్షిత తాగు నీటి నల్లా కనెక్షన్లు ఇప్పించామన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పిఎం కిసాన్ సమృద్ధి యోజన ద్వారా 11 కోట్ల పైగా రైతులకు ఏడాదికి రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. పీఎం ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 37 కోట్ల లబ్ధిదారులకు ఆరోగ్య బీమా కల్పంచామన్నారు. పీఎం స్వనిధి ద్వారా 78 లక్షల వీధి వ్యాపారులకు చేయూత కల్పించినట్లు తెలిపారు. జన్ ధన్ ఖాతాల ద్వారా 51 కోట్ల మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా 20 నగరాల్లో మెట్రో సేవల విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఇలా బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్చుగ్.
దీనిపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ మేనిఫెస్టో కాలం చెల్లిన చెక్కులాంటిదని ఎద్దేవా చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని అన్నారు. దేశంలో 2004 చరిత్ర పునరావృతం కాబోతోందని తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు.. పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ పదేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు మాజీ మంత్రి హరీష్రావు. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన బీజేపీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నికల వేడి రాజుకుంది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. బీజేపీ ఆవిష్కరించిన ఈ సంకల్పపత్రం 400 ప్లస్ టార్గెట్ సాధనలో ఏ మేరకు ఊపయోగపడుతుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




