Telangana: క్యాబ్లో ఏసీ కావాలంటే అదనపు ఛార్జీ చెల్లించాల్సిందే..
ఉబెర్, ఓలా, రాపిడో వంటి ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లు అందిస్తున్న కిలోమీటరు ఛార్జీలను తగ్గించినందున.. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ (టిజిపిడబ్ల్యుయు) సోమవారం, ఏప్రిల్ 8వ తేదీన 'నో ఎసి క్యాంపెయిన్' ప్రకటించింది. ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు వసూలు చేస్తున్న కమీషన్లను లెక్కించిన తర్వాత, డ్రైవర్లు కిలోమీటరుకు 10-12 రూపాయలు మాత్రమే పొందగలుగుతున్నారని గిగ్ వర్కర్ బాడీ తెలిపింది.

తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇటు హైదరాబాదులోనూ భానుడ భగభగమంటున్నారు. గ్రేటర్లో 42 డిగ్రీలు దాటీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ ప్రభావంతో ప్రయాణికులు క్యాబ్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లకు చేరుకోవాలంటే చాలామంది క్యాబ్లను బుక్ చేసుకుంటున్నారు. క్యాబ్లో అయితే ఏసీ ఉంటుంది.. చల్ల చల్లగా గమ్యం చేరవచ్చు అనుకుంటున్నారు. కానీ క్యాబ్ ఎక్కాక సీన్ మొత్తం రివర్స్ ఉంటోంది. ఏసీ వెయ్యాలంటే అదనంగా పే చేయాల్సి ఉంటుందంటున్నారు క్యాబ్ డ్రైవర్లు. అదనపు ఛార్జీలు చెల్లిస్తేనే ఏసీ వేస్తామని, తమను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. జంటనగరాల్లో ప్రధాన కంపెనీలైన ఓలా, ఉబర్, రాపిడో అగ్రిగేటర్ సంస్థల తరఫున క్యాబ్లు నడుపుతున్న డ్రైవర్లు రెండు రోజులుగా ఈ ‘నో ఏసీ క్యాంపైన్’ నడిపిస్తున్నారు. ఏసీతో నడిపించాలంటే అగ్రిగేటర్ సంస్థలు చెల్లించే కమీషన్ సరిపోవడం లేదని తెలంగాణ గ్రిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్ల యూనియన్ వాదిస్తోంది. కమీషన్లు పెంచాలని ఇప్పటికే వారి దృష్టికి తీసుకెళ్లినట్లు టీజీపీడబ్ల్యుయూ చెబుతోంది. లేదంటే కర్ణాటక రాష్ట్రం తరహాలో క్యాబ్లకు యూనిఫాం రేట్లు అమలు చేయాలని వాదిస్తోంది.
ఇప్పటికే పీక్ అవర్స్, ఇతర ఛార్జీల పేరుతో కొన్నిసార్లు తక్కువ దూరానికి కూడా ఎక్కువ ఛార్జీలు చెల్లిస్తున్నామని, ఏసీ సేవల పేరుతో అదనంగా ఎలా చెల్లిస్తామని ప్రయాణికులు వాదిస్తున్నారు. డ్రైవర్లతో వాదనకు దిగుతూ ఆయా కంపెనీలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఛార్జీలు గిట్టుబాటు కాకపోతే ఆయా అగ్రిగేటర్ సంస్థలతో తేల్చుకోవాలని, ఇలా క్యాబ్ ఎక్కాక ఏసీ వేయకపోవడం కరెక్ట్ కాదంటున్నారు. అయితే ప్రయాణికులే తమకు కీలకమని, వారిని ఇబ్బంది పెట్టాలని తమ ఉద్దేశం కాదని, తమను అర్థం చేసుకోవాలని టీజీపీడబ్ల్యూయూ ప్రతినిధులు చెబుతున్నారు. క్యాబ్ డ్రైవర్లకు తక్కువ కమీషన్పై గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలని తెలిపారు.మరోవైపు డ్రైవర్లు క్యాబ్ల్లో ఏసీ వేసేందుకు నిరాకరిస్తే చర్యలు తీసుకుంటామని ఆయా అగ్రిగేటర్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ట్రిప్ ఛార్జీల్లో 25శాతం కోతతోపాటు, ఖాతాను టెంపరరీగా తాత్కాలికంగా బ్లాక్ చేయడమే కాకుండా..వారం వారీగా ఇన్సెంటివ్స్ పొందే అర్హత కోల్పోతారని తెలిపాయి. అంతేకాక విమానాశ్రయం, రెంటల్స్ లేదా ఇంటర్సిటీ ట్రిప్లు కోల్పోతారని చెబుతున్నాయి. అయితే క్యాబ్ డ్రైవర్లు మాత్రం ‘నో ఏసీ’ క్యాంపైన్పై వెనక్కి తగ్గమంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇదే కొనసాగిస్తామంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
