Telangana: హైదరాబాద్ వాసులకు మరో సూపర్ గుడ్ న్యూస్.. రీజినల్ రింగు రోడ్డు పనులు ఇక చకచక..
హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగం పనులను అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో చేపట్టాలని NHAI నిర్ణయించింది. ప్రమాదాలను అరికట్టడం, ట్రాఫిక్ నిబంధనల అమలులో పారదర్శకత కోసం ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు(RRR) ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. ఈ ప్రాజెక్టు ఉత్తర భాగం పనులను అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత సాంకేతికతతో నిర్మించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడ్పల్లి వరకు 161.5 కిలోమీటర్ల మేర ఈ ఆరు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. ఈ రహదారి వెంట ‘అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ (ATMS)ను ఏర్పాటు చేయనున్నారు. రహదారి పొడవునా అత్యాధునిక ఏఐ కెమెరాలను ఏర్పాటు చేసి, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేస్తారు. ఇవి మితిమీరిన వేగంతో వెళ్లే వాహనాలను గుర్తించి ఆటోమేటిక్గా చలాన్లు జారీ చేస్తాయి.
ఈ టెక్నాలజీని ఏపీ, తెలంగాణ పోలీసు, రవాణా శాఖలతో అనుసంధానం చేయడం ద్వారా రోడ్డు భద్రతను పర్యవేక్షిస్తారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ వ్యవస్థ వెంటనే అలర్ట్ చేస్తుంది, తద్వారా క్షతగాత్రులకు త్వరితగతిన వైద్య సహాయం అందేలా చూస్తుంది. ఇవే కాకుండా, హైదరాబాద్-విజయవాడ(232 కి.మీ), హైదరాబాద్-నాగ్పూర్ (251 కి.మీ) జాతీయ రహదారులపై కూడా ఇదే తరహా ఏఐ సాంకేతికతను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మం-దేవరపల్లి మధ్య ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీని విజయవంతంగా అమలు చేస్తుండటంతో, కొత్త ఎన్హెచ్ఏఐ రహదారులన్నింటికీ దీనిని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది.
