తీవ్ర విషాదం.. సిమెంట్ స్తంభాల కింద చితికిన కూలీల బతుకులు!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతల మానేపల్లి వద్ద సిమెంట్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కూలీల జీవితాలను ఈ విషాద ఘటన చిదిమేసింది.

రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు.. ప్రమాదంతో చెలగాటం ఆడుతున్నాం అని తెలిసినా.. ఇల్లు గడవడానికి పని వెళ్లక తప్పని పరిస్థితి. రోజూ లాగే వాళ్లు సద్ది కట్టుకొని పనికి వెళ్లారు. కానీ విధి వారి జీవితాలను చిదిమేసింది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు కన్నుమూశారు. ఈ విషాద ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. చింతల మానేపల్లి మండలం బాబాసాగర్ – డబ్బా ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిమెంట్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు కూలీలు స్తంభాల కింద నలిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కెరమెరి నుంచి చింతలమానేపల్లి వైపు పంట పొలాల్లో పెన్షింగ్ వైర్లు అమర్చే పనుల కోసం సిమెంట్ స్తంభాలను లోడ్ చేసుకుని వెళ్తున్న క్రమంలో బాబాసాగర్ సమీపంలోకి రాగానే ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న కూలీలపై భారీ సిమెంట్ స్తంభాలు పడటంతో ఇద్దరు కూలీలు వాటి కింద నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సహయకచర్యలు అందించడంతో స్తంబాల కింద చిక్కుకున్న నలుగురిని స్థానికులు రక్షించి 108 వాహనంలో కాగజ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నలుగురిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
