Munugode Bypoll: ‘ఈ సభలో ఆయన లేడని బాధపడ్డా’.. చండూరు సభలో సీఎం కేసీఆర్..
మునుగోడు ఉపఎన్నికకు ఓటింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చండూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభావేదికలో ఎన్నో కీలక కామెంట్స్ చేసిన ఆయన..
మునుగోడు ఉపఎన్నికకు ఓటింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చండూరులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభావేదికలో ఎన్నో కీలక కామెంట్స్ చేసిన ఆయన.. మంత్రి జగదీశ్ రెడ్డి లేకపోవడంపై కూడా స్పందించారు. మంత్రి జగదీశ్ రెడ్డి లేకుండా గత 20 ఏళ్లలో తాను ఏ సభలోనూ మాట్లాడలేదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 2001 నుంచి ఆయన ఉద్యమంలో ఉన్నారని, తాను చేపట్టిన ప్రతీ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉండేవారని పేర్కొన్నారు. జగదీశ్ రెడ్డి ఈ సభకు రాలేడని బాధతో వచ్చానన్నారు సీఎం. మంత్రి జగదీశ్ రెడ్డి ఏం తప్పు చేశారని ఆంక్షలు విధించారని ప్రశ్నించారు కేసీఆర్. ఆయనను ఇక్కడి నుంచి ఎందుకు పంపించారని ప్రశ్నించారు. ‘గుండాగిరి చేశాడా? కొట్టాడా? దౌర్జన్యం చేశామా? టీఆర్ఎస్ కు ఆ చరిత్ర ఉందా? వామపక్షాలకు ఆ చరిత్ర ఉందా? ఏం దౌర్జన్యం చేశామని? ప్రశాంత వాతావరణంలో మా ప్రచారం మేం చేసుకుంటున్నాం. ఆయన లేరనే బాధ ఉంది. కుట్రలతో ఆయనను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. వీటన్నింటికి మునుగోడు ప్రజలు తమ ఓటుతో బీజేపీకి బుద్ధి చెప్పాలి. 3వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండండి. చైతన్యంతో ఓటు వేసి బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలి.’ అని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఇదే సమయంలో వరి ధాన్యం కొనుగోలు అంశంపై స్పందించిన సీఎం కేసీఆర్.. కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. వడ్లు కొనమని కోరితే.. నూకలు తిని బతకండి అంటూ కేంద్ర మంత్రులు అవహేళన చేశారని ఫైర్ అయ్యారు. ‘నూకలు తినమని ఎవరైతే అన్నారో.. ఇప్పుడు వారే వచ్చి తమకు ఓట్లు వేయమని అడగుతున్నారు. వారికి ఎంత ధైర్యం ఉంటే ఇలా అడుగుతారు. అంత అమాయకంగా మనం వారికి ఓటు వేయాలా? చాలా ప్రలోభాలకు గురి చేస్తారు. మందు, విందు ఇస్తారు. బంగారం, బట్టలు కూడా ఇస్తారు. గెలిచిన తరువాత ఒక్కరూ కనిపించరు. 4వ తేదీన గిదే ప్రభాకర్ రెడ్డి, గిదే కేసీఆర్ ఉంటారు.’ అని సీఎం వ్యాఖ్యానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..