కన్నతల్లి పేరిట ఉన్న భూమే ప్రాణం తీసింది.. అన్నదమ్ముల ఆస్తి గొడవల్లో దారుణం
కన్నతల్లి పేరిట ఉన్న భూమి కోసం అన్నదమ్ముల మధ్య నెలకొన్న వివాదం ఓ వృద్ధురాలి ప్రాణాలను బలితీసుకుంది. రోజురోజుకూ తీవ్రరూపం దాల్చిన ఈ భూ వివాదం, కొడుకుల మధ్య ఘర్షణలు తల్లిని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది..

మెదక్, జులై 7: కన్నతల్లి పేరిట ఉన్న భూమి కోసం అన్నదమ్ములు మధ్య జరిగిన గొడవలు ఒక వృద్ధురాలి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. తల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులు.. భూమి కోసం నిత్యం గొడవపడు తుండటంతో మనస్థాపానికి గురైన మోచ ఎల్లమ్మ అనే వృద్ధురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన మోచ ఎల్లమ్మకి ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు ఆంజనేయులు, చిన్న కుమారుడు స్వామి. కాగా ఎల్లమ్మ పేరిట కొంత భూమి ఉంది. అయితే ఆ భూమిని తమ పేరిట మార్చాలంటూ ఆమె కుమారులు కొంతకాలంగా నిత్యం గొడవకు దిగుతున్నారు. అన్నదమ్ముల మధ్య ఈ భూ వివాదం రోజురోజుకూ ముదిరిపోయింది. కన్నతల్లి అని కూడా చూడకుండా కొడుకులు నిత్యం వేధిస్తుండటం.. వారి మధ్య జరుగుతున్న ఘర్షణలను తట్టుకోలేక ఎల్లమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది.
ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి చెందిన ఆమె.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న చిన్న శంకరంపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కన్నకొడుకుల ఆస్తి కాంక్షే ఒక తల్లి ప్రాణం తీయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.




