ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారించింది హైకోర్ట్. నోటీసులిచ్చినా బీఎల్ సంతోష్, తుషార్, జగ్గు స్వామిలు విచారణకు హాజరుకాలేదని సిట్ బృందం కోర్టుకు తెలిపింది. నోటీసులిచ్చినా హాజరుకాకపోవడంతో ఏదైనా ఆర్డర్ ఇవ్వాలని హైకోర్ట్ను కోరింది సిట్. సంతోష్కు నోటీసులు అందాయని కోర్టుకు తెలిపారు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్. అయితే గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కారణంగా హాజరుకాలేదన్నారు పిటిషన్ కౌన్సిల్.అరెస్ట్ ప్రొటెక్షన్ ఉండదని ఆర్డర్ ఇచ్చినప్పటికీ సంతోష్ ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించింది హైకోర్ట్. సుప్రీం ఆదేశాలు.. సిట్ విచారణ అంశాలపై రేపు మరోసారి విచారించనుంది హైకోర్ట్. ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరు కావాల్సి ఉన్న ముగ్గురికి లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలు సోమవారం విచారణకు హాజరు కాలేదు. బీఎల్ సంతోష్ ఆఫీస్లో సైతం పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే బీఎల్ సంతోష్ తాను వేరే రాష్ట్రంలో పర్యటిస్తున్నాని, అందువల్ల సిట్ ముందుకు వచ్చేందుకు సమయం కావాలని కోరాడు.
కాగా ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు సోమవారం న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. మరోవైపు కేరళ వైద్యుడు జగ్గుస్వామీ మాత్రం ఇంకా పరారీలో ఉన్నాడు. దీంతో అతను విదేశాలకు పారిపోకుండా తెలంగాణ పోలీసులు అన్ని విమానశ్రయాల్లో అలర్ట్ జారీ చేశారు. అంతేకాకుండా విదేశాలకు చెక్కేయకుండా ముందస్తుగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది సిట్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..