సినిమాను తలపించిన రియల్ స్టోరీ.. తలకు గాయంతో గతం మర్చిపోయిన వ్యక్తి..14ఏళ్లకు అదే గాయంతో..
సాధారణంగా సినిమాల్లో తలకు గాయమై గతం మర్చిపోవడం, మళ్లీ తలకు దెబ్బతగిలి గతం గుర్తురావడం వంటి సన్నివేశాలు చూస్తుంటాం. సరిగ్గా అలాంటి అరుదైన, భావోద్వేగ సంఘటనే కామారెడ్డి జిల్లాలో ఆవిష్కృతమైంది. 14 ఏళ్ల క్రితం తప్పిపోయి, కుటుంబ సభ్యులు ఇక రాడని భావించిన ఓ కొడుకు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా సినిమాల్లో కనిపించే సన్నివేశం ఒకటి కామారెడ్డి జిల్లాలో ఆవిష్కృతం అయింది..తలకు గాయంతో ఇంటినుండి తప్పిపోయిన వ్యక్తి మళ్లీ అదే గాయంతో 14 ఏళ్ల తరువాత తిరిగి ఇంటికి వచ్చాడు..కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన బక్కన్నగారి నర్సవ్వ, బాలయ్యలకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు రాజు ఇంటర్ మొదటి సంవత్సరంతో చదువు ఆపేసి స్నేహితులతో కలిసి కామారెడ్డి పట్టణ సమీపంలోని గ్రానైట్ కంపెనీలో పనిచేసేవాడు. ఓ రోజు రాయి తగలడంతో తలకు గాయమై మానసికంగా దెబ్బతి న్నాడు. 2012 సంవత్సరంలో ఎడ్ల పొలాల అమా వాస్య రోజు వేకువజామున ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా రాజు బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. కొడుకు ఏమయ్యాడోనని అతడి తల్లి ఏడవని రోజు లేదు.
మానసిక స్థితి సరిగా లేని రాజు.. మహారాష్ట్రలోని పుణె జిల్లా భోర్ పట్టణానికి చేరాడు. అక్కడ ఒక హోటల్ నిర్వాహకుడు ప్రకాశ్ మగందే అతడిని చేరదీసి పని కల్పించి సొంత మనిషిలా చూసుకున్నాడు. మరాఠీ నేర్చుకున్న రాజు.. క్రమం గా తెలుగు మరిచిపోయాడు. కరోనా కాలంలో తల్లిదండ్రులు, స్నేహితులు, చిన్ననాటి విషయాలు కొంత గుర్తుకు వచ్చినా.. తన ఊరు ఎక్కడో మాత్రం అర్థం కాలేదు. ఏడాదిన్నర క్రితం రాజు పనిచేస్తుండగా తలకు దెబ్బతగలడంతో కిందపడిపోయాడు. హోటల్ యజమాని వైద్యం చేయించాడు. కోలుకున్నాక అతడికి తల్లిదండ్రులు, చిన్ననాటి స్నేహితుల వివరాలు కొంత గుర్తుకు రావడంతో విషయాన్ని హోటల్ యజమానికి వివరించాడు.
సొంతవారిని చేరడానికి రాజు తన స్నేహితుడు శ్యామ్ ఫోన్ నంబర్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. పది అంకెల్లో మొదటి ఏడు అంకెలు మాత్రమే గుర్తుకువచ్చాయి. చివరి మూడు అంకెల కోసం ఏడాదిన్నరగా ప్రయత్నిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం చివరి మూడు అంకెలను మార్చి మార్చి ప్రయత్నించగా.. ఆ రోజు 22వ ప్రయత్నం లో శ్యామ్కు కాల్ కనెక్ట్ అయ్యింది. అయితే, మరాఠీ భాషలో మాట్లాడడంతో శ్యామ్ కు ఏమీ అర్ధం కాలేదు. వీడియో కాల్ ద్వారా రాజును గుర్తించిన శ్యామ్.. అతడి తల్లి నర్సవ్వతోనూ మాట్లాడించాడు. హోటల్ యజమాని ద్వారా అడ్రస్ తెలుసుకొని అక్కడికి వెళ్లి రాజును తీసుకొని స్వగ్రామానికి చేరుకున్నారు. 14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు తిరిగి తన దగ్గరికి చేరడంతో తల్లి నర్సవ్వ ఆనందానికి అవధుల్లేవు..గ్రామస్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




