Chandrababu – Tummala: ఆ ఐదు గ్రామాల కోసం.. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి తుమ్మల భేటీ..
ఆ ఐదు గ్రామాల అంశంతో పాటు పలు సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబును కలిసి చర్చించారు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వీటితో పాటు పలు ఇతర అంశాలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును.. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమస్యలపై తుమ్మల చర్చించారు. 5 గ్రామపంచాయతీల విలీనం, పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వేలైన్లు, నేషనల్ హైవేలపై ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ఏలూరు-కొత్తగూడెం, జగ్గయ్యపేట నేషనల్ హైవే పనుల వేగవంతంపై చొరవ చూపాలని మంత్రి తుమ్మల చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు టీటీడీలో తెలంగాణకు ఐదెకరాల స్థలం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ పరిధిలోకి వెళ్లిన ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో విలీనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తుమ్మల పలుసార్లు వెల్లడించారు.
భద్రాచలం అభివృద్ధిలో ఆ ఐదు గ్రామాలు ఎంతో కీలకమని, సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు. ఉష్ణ గుండాల, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, ఎటపాక, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉందని ఆయన గతంలోనూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. భద్రాచలం పట్టణం మాత్రమే తెలంగాణలోనే ఉండగా.. ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు ఏపీ భూభాగంలోకి వెళ్లాయి.
ఈ ఐదు గ్రామాల ఆవాసాలు భౌగోళికంగా రెండు వైపులా తెలంగాణ భూముల మధ్య ఉన్నాయి. మరోవైపు గోదావరి నది, రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలు ఉండటంతో పరిపాలన పరంగా కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయన్న వాదన ఉంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి తుమ్మల ఈ అంశంపై మరోసారి ఆయనతో చర్చించారు. దీంతో పాటు పలు ఇతర అంశాలను ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
