New Pensions: తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్ అప్డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ.. అర్హులు వీరే!
TS New Pension Scheme: రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అర్హులైన ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు స్పష్టం చేశారు.

తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ఒంటరి మహిళలకు పింఛన్లు మంజూరు చేయనున్నట్టు తెలిపింది. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల కొత్త పింఛన్లు ఇస్తామని ప్రకటించిన తెలంగాణ సర్కార్, వాటిని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ములుగు జిల్లా పర్యటనలో భాగంగా ఈ కొత్త పింఛన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అందరికీ పింఛన్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
అయితే పింఛన్ల పంపిణీ పారదర్శకంగా జరపాలని.. ఇప్పటికే పింఛన్లు పొందుతున్న అర్హులు ఎవరైనా మరణిస్తే.. జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని మంత్రి తెలిపారు. అలాగే ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన పెంచాలని.. అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి.. పథకాలను వర్తింపజేయాలని అధికారులకు సూచించారు. పథకాల అమలులో ఎలాంటి జాప్యం లేకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పింఛన్ల పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
అనర్హులు పింఛన్లు పొందడం వల్ల నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని.. కాబట్టి కేవలం అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇదిలా ఉండగా, పింఛన్ పొందుతున్న వారి లబ్ధిని నిర్ధారించేందుకు ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ నెలాఖరులోపు ఈ ప్రక్రియను పూర్తి చేసి.. ఆగస్టు నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ డబ్బులు అందజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
