Hyderabad: ఆరే ఎంట్రా ఇది.. పైకి చూస్తే బాదం మిల్కే.. కానీ టేస్ట్ చేస్తే కథ వేరే
హోలీ సీజన్ను టార్గెట్గా చేసుకుని గంజాయి చాక్లెట్లను తండాయిలో కలిపి అమ్ముతున్న ఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. నిన్న మొన్నటి వరకు గంజాయి చాక్లెట్లను విడిగా అమ్ముతున్న ఘటనలు వెలుగులోకి రాగా.. తాజాగా అదే చాక్లెట్లను పాలతో తయారయ్యే తండాయిలో మిక్స్ చేసి.. రెట్టింపు రేట్లకు విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. ఇలా అక్రమంగా గంజాయి తండాయిలను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ STF అధికారులు.

హోలీ సీజన్ను టార్గెట్గా చేసుకుని గంజాయి చాక్లెట్లను తండాయిలో కలిపి అమ్ముతున్న ఘటన హైదరాబాద్లో. రూ.50కి అమ్మాల్సిన తండాయిని గంజాయి చాక్లెట్స్ కలిపి రూ.150కి విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని ఎక్సైజ్ STF అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన ఉప్పుగూడ చార్మీనార్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ STF టీమ్ లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి నిర్వహించిన తనిఖీల్లో ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన బి. వికాస్ శర్మ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇతను గత కొంతకాలంగా చూడీ బజార్ నుంచి బేగంబజార్ మధ్యలో తండాయి పేరుతో పాలు అమ్మకాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. వేడి చేసి చల్లార్చిన పాలల్లో ఐస్, డ్రైఫ్రూట్స్ కలిపి గతంలో ఒక్క గ్లాస్ను రూ.50కి విక్రయించేవాడు. అయితే వేసవిలో చల్లదనం పేరుతో, హోలీ సీజన్ డిమాండ్ను ఆసరాగా చేసుకుని గంజాయి చాక్లెట్లను మిక్స్ చేసిన తండాయిని రూ.150కి అమ్ముతూ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వికాస్ శర్మ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడి నుంచి మొత్తం 1920 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ చాక్లెట్లలో మొత్తం 9.60 కేజీల గంజాయి మిక్సింగ్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కొక్క గంజాయి చాక్లెట్లో 5 గ్రాముల గంజాయి కలిపినట్లు నిందితుడు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ గంజాయి చాక్లెట్లను ఆగ్రా నుంచి తెప్పించినట్లు, హోలీ సందర్భంగా గిరాకీ ఎక్కువగా ఉంటుందని భావించి భారీగా స్టాక్ తెప్పించాడని విచారణలో వెల్లడైంది. నిందితుడిని, అతని బైక్ను, స్వాధీనం చేసుకున్న గంజాయి చాక్లెట్లను చార్మీనార్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించినట్లు STF టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
